June 26, 2013

బాబు వచ్చే.. పప్పూ, కూర వచ్చే!

రాజకీయ ప్రత్యర్థులపై తెదేపా అధినేత నారా చంద్రబాబు తనయుడు నారా లోకేష్ మరోసారి చురకలంటించారు. ఉత్తరాఖండ్ లో చిక్కుకున్న తెలుగువారిని రక్షించడానికి, అదేవిధంగా రక్షించబడి ఏపీ భవన్ లో చికిత్స పొందుతున్న వారికి సరైన వైద్యం అందేలా.. తెదేపా అధినేత చేస్తున్న సహాయ సహకారాలను అధికార కాంగ్రెస్ నేతలు రాజకీయ లబ్ధికోసమే అని విమర్శిస్తున్న విషయం తెలిసిందే. ఇక ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అయితే.. “చింతా చచ్చినా.. పులుపు చావదాయె” అంటూ వ్యంగ్యాస్త్రాలు కూడా విసిరారు.
కాంగ్రెస్ నేతలు చేస్తున్న విమర్శలపై చంద్రబాబు తనయుడు నారా లోకేష్ సోషల్ నెట్ వర్కింగ్ సైట్ ట్విట్టర్‌లో భిన్నంగా స్పందించారు. “ఉత్తరాఖండ్ వరదబాధితులకు సహాయ కార్యక్రమాలు ఎలా కొనసాగుతున్నాయో తెలుసుకోవడం రాజకీయమా? అని ప్రశ్నించారు. అంతేకాకుండా రాజకీయమే అనుకుంటే… ఆయన రాజకీయం బాధితులకు అన్నం పెట్టేలా చేసిందని” అభిప్రాయపడ్డారు.
నిన్న బాబు ఢిల్లీలో నిర్వహించిన కార్యక్రమాలపై ఓ వార్తా పత్రిక వార్తను కూడా అందులో ఉంచారు. ’బాబు వచ్చే.. పప్పూ, కూర వచ్చే! అనే వార్త ఓ పత్రికలో వచ్చింది. దానిని కూడా లోకేష్ తన ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. ఢిల్లీలోని ఎపి భవన్‌కు బాబు రాకముందు సాంబరు అన్నం, పెరుగు మాత్రమే పెట్టేవారని… బాబు ఫిర్యాదు చేయడంతో రాత్రికి రాత్రే మెనూ మారిపోయిందని, అన్నం, పప్పు, పెరుగులతో పాటు కూరగాయలు పెడుతున్నారని అందులో పేర్కొన్నారు.
ట్విట్టర్ లో పోస్ట్ తో లోకేష్ ఊరుకోలేదు విలేకర్ల సమావేశంలో పెట్టి మరీ ప్రభుత్వం వైఖరిని ఎండగట్టారు. లోకేష్ విలేకర్లతో మాట్లాడుతూ.. బాధితులకు ఎలా చేయాలో తాము చేసి చూపించామని, రాజకీయ లబ్ధి కోసమనే విమర్శలు సరికావని, తాము సహాయం చేయడంలో నిమగ్నమై ఉన్నామని చెప్పారు. కాగా, తెలుగుదేశం పార్టీ బాధితుల కోసం ప్ర్తత్యేక విమానం ఏర్పాటు చేయడంతో పాటు.. చికిత్స కోసం వైద్య బృందాన్ని పంపించిన విషయం తెలిసిందే.