January 26, 2013

ఓటమి భయంతో సహకార ఎన్నికల్లో కాంగ్రెస్,వైసీపీ కలిసి పోటీ

తల్లి, పిల్ల కాంగ్రెస్‌లు ఏకమై సహకార ఎన్నికలలో నాటకాలు ఆడుతున్నాయని జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, మైలవరం శాసన సభ్యుడు దేవినేని ఉమామహేశ్వరరావు ఆరోపించారు. గురువారం ఆయన ఆంధ్రజ్యోతితో మాట్లాడుతూ జిల్లాలో సహకార ఎన్నికలలో గెలవలేమన్న భయంతో కాంగ్రెస్, వైసీపీలు కలిసి పోటీకి దిగాయన్నారు. ఎట్టి పరిస్థితులలోనూ గెలవలేమన్న నిర్దారణకు వచ్చిన సంఘాలపై మంత్రి స్టేలు తీసుకువచ్చారన్నారు. న్యాయ పోరాటం చేసైనా ఆ సంఘాలకు ఎన్నికలు జరిపించి విజయభేరి మోగిస్తామన్నారు. తెలుగుదేశాన్ని ఎదుర్కొనేందుకు రెండు పార్టీలూ కలిసినా దమ్ము చాలకే ఇటువంటి చిల్లర ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు.