January 26, 2013

రాజ్యాంగం కోసమూ రణమేనా!

అవినీతిపై నా పోరాటం ఒక స్పష్టమైన ఆకృతి దాల్చడాన్ని ఐతవరంలో చూశాను. ఆ ఊరు నా షెడ్యూల్‌లో లేకపోయినా జాతీయ రహదారి పక్కన ఉండటంతో పలకరించాలనిపించింది. ఊళ్లోకి వెళ్లిన నాకు విద్యార్థులు నవ్వు చిందే మోములతో ఆహ్వానం పలికారు. వారితో కొద్దిసేపు గడిపాను. ఈ సమయంలో ఆ చెల్లెలు ముందుకొచ్చింది. అవినీతిపై ఏదైనా మాట్లాడాలని నేను కోరడమే తరువాయి, తడుముకోకుండా మన అవినీతి నేతలందరికీ తలంటు పోసేసింది తిరుపతమ్మ. ఇంటర్ స్థాయిలోనే ఇంత చైతన్యమా అని ముచ్చటేసింది. నేరుగా పేరు తీసుకోకుండానే 'లక్ష కోట్ల' అవినీతిపై సూదిమొనలాంటి ప్రశ్నలను సంధించింది.

" కుటుంబంతో, మనవళ్లు, మనవరాళ్లతో విలాసంగా బతకడానికి ఒక వ్యక్తికి ఐదు వందల కోట్లు చాలవా? లక్ష కోట్లు పోగేసుకొని ఏమి చేస్తారు? ఆ డబ్బుంతా ప్రజలకు ఖర్చు చేయొచ్చు కదా?. ఈ నాయకులంతా తమ బీరువాలు, బ్యాంకు లాకర్లను దోపిడీ సొమ్ముతో నింపుకోవడంపైనే ఆసక్తి చూపుతున్నారు తప్ప బీదలను పట్టించుకోవడం లేదు'' అని ఆక్రోశం వెళ్లగక్కింది. నా పోరుకు ఇలాంటి తిరుపతమ్మలే తలపాగా!

నడక దారిలో ఎదురైన ప్రతి ఎస్సీ కాలనీని పరామర్శించాను. 65 సంవత్సరాల స్వాతంత్య్ర భారతంలోనూ ఇంత దుర్భర దారిద్య్రం ఉందని నమ్మలేకపోయాను. రాజ్యాంగం ఆస్తి హక్కు ను ఇచ్చినా.. సెంటు జాగా కూడా లేనివారే వీరిలో ఎక్కువ. చదువుకోవాలని అంబేద్కర్ చెప్పినా, వారిని బడికి చేర్చే ఔదార్యం ఈ సర్కారుకు లేకుండాపోయింది.

కూలి చేసుకుంటేనే నోట్లోకి నాలుగు మెతుకులు. లేదంటే పస్తులే. ఉన్న దరిద్రం చాలదని సర్కారి ప్పుడు వీళ్ల కడుపులో 'కరెంటు' చిచ్చుపెట్టింది. ఒక బల్బు, ఫ్యాన్ ఉంటేనే అదిరి పోయే బిల్లులు వస్తున్నాయట. వాటిని కట్టకపోతే ఆ ఇచ్చే కరెంటూ నిలిపివేస్తారట. ఉం డటానికి జాతీయరహదారి పక్కనే ఉన్నా.. అభివృద్ధిలో మాత్రం ఈ కాలనీలు ఆమడదూరంలో ఉన్నాయనిపించింది. రాజ్యాంగం అమలు కోసమూ రణం చేయాలా