April 7, 2013

విస్తృతంగా టీడీపీ సంతకాల సేకరణ


ఆత్మకూరు: పెంచిన విద్యుత్ చార్జీలకు నిరసనగా రాప్తాడు నియోజకవర్గంలో ఎమ్మెల్యే పరిటాల సునీత చేపట్టిన సంతకాల సేకరణకు మద్దతుగా మండల టీడీపీ నాయకులు విస్తృతంగా కార్యక్రమం చేపట్టారు. మండలంలో గ్రామ పంచాయతీల వారీగా నాయకులు బాధ్యతలు చేపట్టి సంతకాలు సేకరిస్తున్నారు. ప్రజలు స్వచ్ఛందంగా పెంచిన చార్జీలు తగ్గించాలని సంతకాలు చేయడానికి ముందుకొస్తున్నట్టు పార్టీ మండల నాయకులు వేణుగోపాల్, మనోరంజన్, వెంకటనారాయణ, సాయినాథ్, హనుమప్పచౌదరి, హనుమంతప్పచౌదరి, చికెన్ వలి, శంకరనారాయణరెడ్డి, రవీంద్రరెడ్డి, సుధాకర్‌రెడ్డి, నరసింహ తెలిపారు. తల్లి కాంగ్రెస్, పిల్ల కాంగ్రెస్ ప్రజల్లో నమ్మకాన్ని కోల్పోయాయని, దోచుకోవడం తప్ప ప్రజలకు సేవ చేసిందేమీ లేదని విమర్శించారు.

భవిష్యత్తు టీడీపీదే అధికారమని వారు పేర్కొన్నారు. శింగనమల: రాష్ట్రంలో అలజడి రేపుతున్న విద్యుత్ చార్జీల పెంపు, కోతలకు నిరసనగా మండలంలోని నాయపల్లి క్రాస్ వద్ద సంతకాల సేకరణ, రాస్తారోకో నిర్వహిస్తున్నట్లు టీడీపీ మండల అధ్యక్షుడు అమ్మలదిన్నె చితంబరిదొర  ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10 గంటలకు నాయనపల్లి క్రాస్ వద్ద విద్యుత్ సమస్యలపై సంతకాల సేకరణతో పాటు రాస్తారోకో ఏర్పాటు చేస్తామన్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ పామిడి శమంతకమణి హాజరవుతారన్నారు. కార్యక్రమానికి రైతులు, పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలిరావాలన్నారు.