April 7, 2013

కార్యకర్తలు ఓకే.. నేతలే మారాలి

టీడీపీకి అంకిత భావం కలిగిన కార్యకర్తలు ఉన్నారని, కొన్ని చోట్ల నాయకులు మాత్రం ఉదాశీనంగా వ్యవహరిస్తున్నారని చంద్రబాబు చికాకుపడ్డారు. శంఖవరం మండలం నెల్లిపూడిలో ప్రత్తిపాడు, రంపచోడవరం పార్టీ కార్యకర్తల సమీక్ష సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ప్రత్తిపాడు నియోజకవర్గానికి చెందిన ఒక కార్యకర్త తమ నాయకులు నమస్కారం పెట్టిన వారినే సమావేశాలకు పిలుపుస్తున్నారని, ఈ ధోరణి మారాలని చంద్రబాబుకు ఫిర్యాదు చేశారు. చిట్టిబాబూ.. ఇలాంటివి రాకూడదు. వీటిని సర్దుబాటు చేయాలి అని చంద్రబాబు ఎమ్మెల్యే పర్వత చిట్టిబాబును ఆదేశించారు.

ఈ సందర్భంగా పలువురు కార్యకర్తలు పార్టీ నేతల వ్యవహారశైలిని చంద్రబాబు దృష్టికి తీసుకువచ్చారు.రంపచోడవరం నియోజకవర్గంలో చిన్నం బాబూ రమేష్, శీతంశెట్టి వెంకటేశ్వరరావు మధ్య సమన్వయం లోపించిందని పలువురు కార్యకర్తలు చంద్రబాబు దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. పార్టీలో గ్రామ, మండల, నియోజకవర్గ సమావేశాలు క్రమం తప్పకుండా నిర్వహించాలని సూచించారు.

ఇక నుంచి కార్యకర్తలు, నాయకులు ఎన్నికల వరకు పూర్తిగా పార్టీ సేవకోసం కేటాయించాలన్నారు. కుటుంబ, వ్యాపార బాధ్యతల్ని భార్య, కొడుకు, కూతుళ్లకు అప్పగించి పార్టీ విజయం కోసం కష్టపడిపని చేయాలని హితవు పలికారు.