April 7, 2013

12 నుంచి విశాఖలో బాబు యాత్ర

విశాఖపట్నం: జిల్లాలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు పాదయాత్ర నిర్ణీత షెడ్యూల్ కంటే ఒకరోజు ఆలస్యంగా ప్రారంభం కానున్నది. ఉగాది నాడు నాతవరం మండలం గన్నవరం మెట్టవద్ద జిల్లాలోకి అడుగుపెట్టాల్సిన చంద్రబాబు 12వ తేదీన రానున్నారు. ఈ విషయాన్ని పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు చింతకాయల అయ్యన్నపాత్రుడు శనివారం 'ఆంధ్రజ్యోతి' ప్రతినిధికి తెలిపారు.

అయితే ముందుగా నిర్ణయించినట్టుగా ఈ నెల 27నే మధురవాడలో పాదయాత్ర ముగించనున్నారు. పాదయాత్రలో ఆదివారాలను కూడా కలిపి ఇప్పటికే షెడ్యూల్‌ను ఖరారుచేశారు. అయితే చంద్రబాబు ఆదివారం విశ్రాంతి తీసుకోనున్నారు.

దీంతో ముందు నిర్ణయించిన షెడ్యూల్ మారనుంది. మారిన షెడ్యూల్ ప్రకారం రూటులో ఎక్కడెక్కడా తగ్గించాలి? అన్నదానిపై ఆదివారం పార్టీ పెద్దలు యనమల రామకృష్ణుడు, గరికపాటి మోహనరావులు జిల్లా నేతలతో సమావేశమై ఖరారుచేస్తారు.

చంద్రబాబుతో


అయ్యన్న భేటీ


తూర్పుగోదావరి జిల్లాలో పాదయాత్ర చేస్తున్న చంద్రబాబును శనివారం అన్నవరం వద్ద అయ్యన్నపాత్రుడు, ఆయన కుమారుడు విజయ్ కలిశారు. విశాఖ జిల్లాలో పాదయాత్రకు సంబంధించిన ఏర్పాట్ల గురించి నివేదించారు. ఆరోగ్యరీత్యా ప్రస్తుతానికి పాదయాత్రను వాయిదా వేసుకోవాలని, ఉత్తరాంధ్రలో తరువాత పర్యటించవచ్చునని అయ్యన్న చెప్పగా చంద్రబాబు సున్నితంగా తిరస్కరించారు. ఈనెల 27 వరకు పాదయాత్ర కొనసాగుతుందని, విశాఖలో బహిరంగ సభలో పాల్గొంటానని స్పష్టం చేశారు. అయితే పాదయాత్రలో ఆదివారాలు విశ్రాంతి తీసుకుంటానని మాత్రం చెప్పారు.