April 12, 2013

విజయీభవ..


కాకినాడ: విజయనామసంవత్సరం. విజయాల వైపు దూసుకుపోదాం. ఇదే ఉత్సాహం, హుషారుతో ప్రజల్లోకి వెళ్తుంటే గెలుపు మనదే.. నంటూ టీడీపీ కార్యకర్తలు ఆనందం వ్యక్తం చేశారు. ఏటా ఎవరి ఇళ్ల వద్ద వారు చేసుకునే ఉగాది పండుగను ఈసారి తెలుగుదేశం కుటుంబ సభ్యులంతా కలసి చేసుకున్నామని సంబరపడుతున్నారు. ఈసందర్భంగా రాజమండ్రికి చెందిన ప్రముఖ పండితులు ప్రభల సుబ్రహ్మణ్య శర్మ నిర్వహించిన పంచాంగ శ్రవణాన్ని చంద్రబాబు ఆసక్తిగా విన్నారు. బాబుతోపాటు పార్టీ నేతలు యనమల రామకృష్ణుడు, గరికపాటి మోహనరావు, చినరాజప్ప, చిక్కాల రామచంద్రరావు, మెట్ల సత్యనారాయణ, యనమల కృష్ణుడు, కొండబాబు, వర్మ, అప్పలరాజు, కొండయ్యదొర, పలువురు మహిళా నేతలు, యువకులు, కార్యకర్తలు చంద్రబాబు సమక్షంలో పం చాంగ శ్రవణం ఆసక్తిగా ఆలకించారు.

అందరూ బాగుండాలి: చంద్రబాబు ఆకాంక్ష

ఆరుగాలం కష్టపడినా రైతులకు గిట్టుబాటురావడంలేదు. బడుగు, బలహీనవర్గాల జీవితాలు ఎఝ్కడవేసిన గొంగళి అక్కడే అన్నట్టు వుండిపోతున్నారు. శ్రామికులు, రైతులు, వృత్తిపనివారు, చిరువ్యాపారులు, చేనేత, కమ్మ రి, కుమ్మరి, అందరి జీవితాలలోనూ ఈ విజయనామ సంవత్సరం వెలుగులు నింపాలని కోరుకుంటున్నాను.. అని చంద్రబాబు అన్నారు.

గెలిచి తీరాలి! తెలుగు తమ్ముళ్ల ఆకాంక్ష

చంద్రబాబు సమక్షంలో ఉగాది ఉత్సవాలలో పాల్గొన్న టీడీపీ కార్యకర్తలలో ఉత్సాహం ఉకలేసింది. విజయనామ సంవత్సరంలో విజయం సా ధించాలని వాళ్లంతా ప్రతినబూనారు. టీడీపీ అధికారంలోకి వస్తే పేదల కష్టాలు పోతాయని పలువురు నేతలు ఆకాంక్షించారు.

సహజసిద్ధ జీవితాలకు వెనక్కిరావాలి: డాక్టర్ ప్రభల

ఆధునిక మానవుడు ప్రకృతిని నాశనం చేస్తున్నాడని, పూర్వీకుల ఆచారాలు, సంప్రదాయాలకు మళ్లీ మనం వెనక్కిరావాలని డాక్టర్ ప్రభల సుబ్రహ్మణ్య శర్మ అన్నారు. ఉగాది పచ్చడిలో ఉండే ఔషధ గుణాలను ఆయన వివరించారు. వేప వంటివాటికి అమెరికావాళ్లు పేటెంట్ పొందడానికి ప్రయత్నించారని, భారతీయులు వేల సంవత్సరాల క్రితంచెప్పిన వాటిని అమెరికా వాళ్లు కనిపెట్టినట్టు గొప్పలు చెప్పుకుంటున్నారని పలు ఉదాహరణలతో డాక్టర్ ప్రభల వివరించారు.

ప్రభల సుబ్రహ్మణ్యం నిర్మొహమాటంగా పంచాంగ శ్రవణం చేశారని చంద్రబాబు కొనియాడారు.

చంద్రబాబు సీఎం కావాలి

- అజ్మీర్‌లో మొక్కిన గన్ని


చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి గన్నికృష్ణ మొక్కుకున్నారు. రాజస్థాన్ రాష్ట్ర అజ్మీర్ దర్గాకు వెళ్లిన ఆయన అక్కడ ప్రత్యేక పూజలు చేయించారు. అజ్మీరు నుంచి తీసుకువచ్చిన తలపాగాను ఉగాది వేడుకల్లో చంద్రబాబుకు బహుకరించారు. ముఖ్యమంత్రిపీఠం అధిరోహించాకా..మీరు అజ్మీర్ వస్తారని మొక్కుకున్నాను.. సార్ మొక్కుతీర్చాలి.. అని చంద్రబాబుకు గన్నికృష్ణ విజ్ఞప్తి చేశారు.