April 12, 2013

భారీ ఎత్తున స్వాగతానికి ఏర్పాట్లు


నాతవరం: 'వస్తున్నా మీకోసం' అంటూ సుదీర్ఘ పాదయాత్ర చేస్తున్న చంద్రబాబు శుక్రవారం సాయంత్రం నాతవరం మండలం గన్నవరంమెట్ట వద్ద జిల్లాలోకి ప్రవేశిస్తున్న సందర్భంగా భారీఎత్తున స్వాగతం పలకడానికి ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలుగుదేశం పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు చింతకాయల అయ్యన్నపాత్రుడు తెలిపారు. గురువారం సాయంత్రం గన్నవరం వచ్చిన ఆయన చంద్రబాబు కోసం చేపట్టిన స్వాగత ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం విలేఖర్లతో మాట్లాడుతూ, ఇక్కడకు వచ్చేసరికి చంద్రబాబు పాదయాత్ర 2,750 కిలోమీటర్లు పూర్తవుతుందని, విశాఖ జిల్లాలో 130 కిలోమీటర్ల మేద పాదయాత్ర ఉంటుందని తెలిపారు.

శుక్రవారం సాయంత్రం గన్నవరంమెట్ట, ఎ.శరభవరం, శృంగవరం, గాంధీనగరం మీదుగా డి.ఎర్రవరం చేరుకొని రాత్రికి అక్కడ బసచేస్తారన్నారు. 13వ తేదీ ఉదయం పాయకరావుపేట నియోజకవర్గానికి చెందిన నాయకులతో చంద్రబాబునాయుడు సమీక్షా సమావేశాన్ని నిర్వహిస్తారని చెప్పారు. అనంతరం విశాఖడెయిరీ ఆధ్వర్యంలో నిర్వహించే మెగా ఉచిత వైద్య శిబిరాన్ని చంద్రబాబు ప్రారంభిస్తారన్నారు. 13వ తేదీ సాయంత్రం డి.ఎర్రవరం నుంచి బయలుదేరి ములగపూడి, ఎం.బెన్నవరం, బయపురెడ్డిపాలెం మీదుగా బలిఘట్టం చేరుకుని అక్కడ బసచేస్తారన్నారు. 14వ తేదీ ఆదివారం పాదయాత్ర వుండదని, అయితే అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని 600 మంది దళితుల సమక్షంలో చంద్రబాబు ఉత్సవాలను నిర్వహిస్తారన్నారు. 15వ తేదీ ఉదయం బలిఘట్టంలో పాడేరు నియోజకవర్గ నాయకులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహిస్తారని, సాయంత్రం నర్సీపట్నం మీదుగా కొండలఅగ్రహారం చేరుకుని రాత్రికి అక్కడ బస చేస్తారని చెప్పారు. 16వ తేదీ ఉదయం చోడవరం నియోజకవర్గ నాయకులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహిస్తారని, సాయంత్రం అక్కడ నుంచి మాకవరపాలెం మీదుగా కన్నూరిపాలెం వరకు పాదయాత్ర చేస్తారని చెప్పారు. జిల్లాలో చంద్రబాబు పాదయాత్ర 27వ తేదీన ముగుస్తుందని, ఆంధ్ర విశ్వవిద్యాలయ ప్రాంగణంలో మూడు లక్షల మందితో బహిరంగ సభను నిర్వహిస్తామని అయ్యన్న చెప్పారు. ఈ కార్యక్రమంలో పరుచూరి కృష్ణ, లాలం అబ్బారావు, నందిపల్లి వెంకటరమణ, లగుడు హరిప్రసాద్, ఎన్.విజయ్‌కుమార్, పారుపల్లి కొండబాబు, సింగంపల్లి బాబు పాల్గొన్నారు.

స్వాగతానికి ఉప్పర్ల ఏర్పాట్లు

చంద్రబాబునాయుడుకు మన్యపురట్ల సెంటర్‌లో భారీఎత్తున స్వాగతం పలకానికి ఏర్పాట్లు చేస్తున్నామని విశాఖ జిల్లా ఉప్పర్ల సంఘం అధ్యక్షుడ ఎస్.చినఅప్పారావు, కార్యదర్శి నక్కా సింహాచలం తెలిపారు. జిల్లాలో ఉప్పర్లు అందరూ శుక్రవారం మధ్యాహ్నానికి మన్యపురట్ల సెంటర్‌కు చేరుకోవాలని వారు పిలుపునిచ్చారు. రాష్ట్ర ఉప్పర్ల సంఘం అధ్యక్షుడు ఎస్.ఏడుకొండలు వస్తున్నారని, ఈ సందర్భంగా తమ సమస్యలను చంద్రబాబు దృష్టికి తీసుకెళతామని వారు చెప్పారు.