April 12, 2013

ఆఖరి పోరాటం! 2014లో చావో రేవో..సర్వశక్తులూ ఒడ్డి పోరాడదాం

కార్యకర్తలకు చంద్రబాబు పిలుపు

"2014 ఎన్నికల్లో భారీ మెజార్టీ సాధించాలి. సీట్లే కాదు.. నియోజక వర్గాల్లో ఓట్లు కూడా భారీగా వచ్చేలా కార్యకర్తలు ఇప్పటి నుంచే ప్రయత్నించాలి. కాంగ్రెస్ చేతకాని పాలన, అవినీతిపైనా, వైసీపీ అక్రమాలు, అరాచకాలపైనా పుస్తకాలు ప్రచురించి విస్తృత ప్రచారం చేస్తాం. కార్యకర్తలు కూడా పత్రికల్లో వచ్చే కథనాలు, ఎస్ఎంఎస్‌ల ద్వారా తల్లి, పిల్ల కాంగ్రెస్ ఆగడాలపై ప్రజలకు అవగాహన కల్పించండి'' అని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా తూర్పు గోదావరి జిల్లా డిక్లరేషన్‌ను వెల్లడించారు. తూర్పు గోదావరిలో కాపు సామాజిక వర్గం ఎక్కువ ఉండడంతో.. కాపుల్లో పేదల కోసం ఏటా రూ.1000 కోట్ల చొప్పున ఐదేళ్లలో రూ.5000 కోట్ల ప్యాకేజీ ఇస్తామని కీలక ప్రకటన చేశారు. దీనికి అనూహ్య స్పందన వచ్చింది. తాను అ«ధికారంలోకి వస్తే విలేకరులకు ఇంటి స్థలాలు ఇస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు.

చంచల్‌గూడలో కేబినెట్ మీటింగ్
"కిరణ్ కిరికిరి సీఎం. దొంగ మంత్రుల కేబినెట్‌కి అధ్యక్షుడు. విద్యుత్తు భారం రూ.6,500 కోట్లు వేసి, అందులో రూ.800 కోట్లు తగ్గించి కిరికిరి చేస్తున్నాడు. నమ్మడానికి ప్రజలు సిద్ధంగా లేరు'' అని చంద్రబాబు దుయ్యబట్టారు. శుక్రవారం సాయంత్రం బాబుకు విశాఖ జిల్లాలో అపూర్వ స్వాగతం లభించింది. ఇక్కడ వివిధ సభల్లో చంద్రబాబు మాట్లాడుతూ, "టీడీపీని స్థాపించి ఎన్టీఆర్ తెలుగు ప్రజల ఆత్మ గౌరవాన్ని ప్రపంచానికి చాటి చెప్పారు. కాంగ్రెస్, వైసీపీ నేతలు అవినీతితో ర్రాష్టానికి చెడ్డపేరు తెస్తున్నారు. ఈ కేబినెట్‌ను చూసి అంతా నవ్వుకుంటున్నారు.

ఒకరి తర్వాత ఒకరుగా అందరిపైనా సీబీఐ కేసులు పెడుతోంది. మాజీ సీఎం కుమారుడు జగన్‌పై 420 కేసు నమోదైంది. ఓ పెద్ద మనిషి వల్ల వోక్స్ వ్యాగన్ ఫ్యాక్టరీ విశాఖకు రాకుండాపోయింది. చీటింగ్ చేసిన పెద్ద మనిషి పీసీసీ అధ్యక్షుడిగా చెలామణి అవుతున్నాడు. మరో మంత్రి హైదరాబాద్‌లో కోట్ల రూపాయ ల భూములు కబ్జా చేసి అడిగిన వారిపై తిరగబడుతున్నాడు. రౌడీలతో కొట్టిస్తున్నాడు'' అంటూ పరోక్షంగా దానంపై ధ్వజమెత్తారు. పైలాన్ నిర్మాణణనికి బ్రేక్: పాదయాత్ర ముగింపునకు చిహ్నంగా విశాఖ నగర శివారు వడ్లపూడిలో నిర్మిస్తున్న పైలాన్ పనులకు శుక్రవారం ఉక్కు భూ సేకరణ విభాగం బ్రేక్ వేసింది.

పైలాన్ నిర్మించతలపెట్టిన స్థలం ఉక్కు భూ సేకరణ విభాగానికి చెందినదని, పైలాన్ నిర్మాణ పనులను నిలిపి వేయాలని ఉక్కు భూ సేకరణ విభాగం డిప్యూటీ తహసిల్దార్ సిద్ధయ్య, గాజువాక తహసిల్దార్ సింహాద్రిరావు స్పష్టం చేశారు. అయితే, ఎస్సీ కోటాలో పెట్రోల్ బంక్ నిర్మాణం నిమిత్తం ఉక్కు భూ సేకరణ విభాగం నుంచి 1.68 ఎకరాల భూమిని మార్కెట్ ధర చెల్లించి కొనుగోలు చేశానని, పైలాన్ నిర్మిస్తున్న స్థలం తనదేనని స్థల యజమాని చక్రవర్తి స్పష్టం చేశారు.
"కార్యకర్తలంతా జెండాలు మోసీ మోసీ అలిసిపోయి ఉన్నారు. ఇంకెన్నాళ్లని మోస్తారు. 2014 ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ గెలిచి తీరాల్సిందే. సర్వ శక్తులూ ఒడ్డి పోరాడాల్సిన ఎన్నికలు రాబోతున్నాయ్. ఇది ఫైనల్ ఎలక్షన్. అవసరమైతే పార్టీ కోసం కొంత సొమ్ము ఖర్చు చేయాలి'' అని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఇది ఆఖరి పోరాటమన్న సంకేతాలు ఇచ్చారు. తూర్పు గోదావరి జిల్లాలో 24 రోజుల్లో 243.5 కిలోమీటర్లు పాదయాత్ర చేసిన చంద్రబాబు.. శుక్రవారం విశాఖలో అడుగుపెట్టారు.