April 12, 2013

టీడీపీని గెలిపించండి

ఆంధ్రజ్యోతి - కాకినాడ: కాంగ్రెస్, పిల్ల కాంగ్రెస్‌లను తరిమికొట్టి టీడీపీని గెలిపించాలని చంద్రబాబు నాయుడు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. 'వస్తున్నా మీ కోసం' పాదయాత్రలో భాగంగా గురువారం తునిరూరల్ మండలం ఎన్. సూరవరం, ఎన్ఎస్ వెంకటనగరం, కాకరాపాల్లిలలో చంద్రబాబు నడిచారు. ఈ సందర్భంగా ఎన్ఎస్ వెంకటనగరం సభలో చంద్రబాబు ప్రసంగించారు. కాంగ్రెస్ దొంగలకు ఎన్నికల ముందు వాగ్ధానాలు చేసి తర్వాత మోసగించడం ఆనవాయితీ అని చంద్రబాబు అన్నారు.

'అమ్మ హస్తం' పథకంలో తొమ్మిది వస్తువులు ఇచ్చి కిరణ్ కుమార్ రెడ్డి దానకర్ణుడిలా ఫోజుకొడుతున్నారని, పేదలకు ఉపయోగపడే పనులు చేయలేని ముఖ్యమంత్రి ప్రజలపై పెత్తనం చెలాయించాలని చూస్తున్నారని ఎద్దేవా చేశారు.

టీడీపీని గెలిపిస్తే తునిరూరల్ మండలంలో పలు గ్రామాలకు తాండ వ నుంచి తాగు, సాగునీరు వచ్చే ఏర్పాట్లు చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు.

శెట్టిబలిజ నేతలతో సమావేశం

గురువారం చంద్రబాబు నాయుడు జిల్లా శెట్టబలిజ నేతలతో సమావేశమయ్యారు. ఈసందర్భంగా తమ సామాజిక వర్గానికి ప్రాధాన్యత లేదని కొంతమంది నేతలు చంద్రబాబు దృష్టికి తీసుకువచ్చారు. గత ఎన్నికలలో కాకినాడ పార్లమెంటు, కొత్తపేట, కాకినాడ రూరల్ అసెంబ్లీ సీట్లిచ్చినా వాళ్లను ఎందుకు గెలిపించుకోలేకోయారని చం ద్రబాబు ప్రశ్నించారు. టికెట్ల ఎంపిక జాప్యం కావడం వల్ల ఇబ్బందులు తలెత్తాయని పలువురు నాయకులు చంద్రబాబుకు చెప్పారు. సమావేశంలో వాసంశెట్టి సత్య, రెడ్డి సుబ్రహ్మ ణ్యం, పిల్లి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.