April 19, 2013

సీమ, తెలంగాణ జిల్లాల నుంచి ప్రత్యేకరైళ్లు వసతికి కల్యాణమండపాలు, లాడ్జీలు రిజర్వు

బాబు సభకు భారీ ఏర్పాట్లు
పైలాన్ నుంచి సభ వరకు చంద్రబాబు ఊరేగింపు
27 సాయంత్రం 4 గంటలకు సభ ప్రారంభం

విశాఖపట్నం : విశాఖపట్నంలో ఈనెల 27న టీడీపీ అధినేత చంద్రబాబు పాదయాత్ర ముగింపు సందర్భంగా నిర్వహించే సభకు పార్టీ నాయకులు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్రం నలుమూలల నుంచి పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తరలి రానున్నందున అందుకు తగిన సన్నాహాలు చేస్తున్నారు. రాయలసీమ, తెలంగాణ జిల్లాల నాయకులు, కార్యకర్తల కోసం 9 ప్రత్యేక రైళ్లు ఏర్పాటుచేయాలని నిర్ణయించారు. వాస్తవానికి 20 రైళ్లు కావాలని దక్షిణ మధ్య రైల్వేను టీడీపీ అధిష్ఠానం కోరగా ప్రస్తుతానికి తొమ్మిదింటికి అనుమతి ఇచ్చింది.

మిగతా రైళ్ల కోసం అధికారులతో టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేత నామా నాగేశ్వరరావు చర్చిస్తున్నారు. ఇంకా కోస్తా జిల్లాల నాయకులు, కార్యకర్తలు బస్సులు, సొంత వాహనాల్లో రానున్నారు. నగరానికి వచ్చేవారికి వసతి కల్పించేందుకు సీనియర్ నేత భరణికాన రామారావు నేతృత్వంలోని కమిటీ ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే నగరంలోని కల్యాణ మండపాలు, లాడ్జిలు రిజర్వు చేసింది. ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలను కూడా రిజర్వు చేయాలని నిర్ణయించింది.

ఇక సభా ప్రాంగణంలో ప్రత్యేకంగా వలంటీర్లను నియమిస్తున్నారు. వారంతా పసుపురంగు టీ షర్టులతో విధులు నిర్వహిస్తారు. వాహనాల పార్కింగ్‌కు కొన్ని స్థలాలు ఎంపిక చేశారు. సభ ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు ఒకటి, రెండురోజుల్లో అగ్రనాయకులు పలువురు విశాఖ చేరుకుంటారని

పైలాన్ నుంచి చంద్రబాబు ఊరేగింపు
27వ తేదీ మధ్యాహ్నం రెండు గంటలకు అగనంపూడి టోల్‌గేటు వద్ద పైలాన్‌ను ఆవిష్కరించనున్న చంద్రబాబు అక్కడి నుంచి ఓపెన్‌టాప్ వాహనంపై సభావేదిక వరకు ఊరేగింపుగా వస్తారు. సుమారు 23 కిలోమీటర్ల దూరం సాగే ఈ ఊరేగింపులో వేలాది వాహనాలు పాల్గొనేలా ఏర్పాట్లు చేస్తున్నారు. సాయంత్రం 4 గంటలకు సభ ప్రారంభం అవుతుంది.

6 గంటలకు చంద్రబాబు మాట్లాడతారు. రాత్రి 8 గంటలకు సభ ముగిసేలా ప్రణాళిక రూపొందించారు. పైలాన్ వద్ద నుంచి ఏయూ ఇంజనీరింగ్ కళాశాల మైదానం వరకు ఎన్టీఆర్, చంద్రబాబు కటౌట్లు పెడతారు. సుమారు 60 అడుగుల ఎత్తులో కటౌట్లు ఏర్పాటుచేసే బాధ్యత హైదరాబాద్‌కు చెందిన చిన్నా సినీ ఆర్ట్స్ సంస్థకు అప్పగించారు.

భారీ వేదిక
ఏయూ ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో భారీ సభావేదికను నిర్మించనున్నారు. 120 అడుగుల పొడవు, 60 అడుగుల వెడల్పు, తొమ్మిది అడుగుల ఎత్తులో ఈ వేదిక ఉంటుంది. వీలైనంత ఎక్కువమంది నాయకులు ఆశీనులయ్యేలా వేదికను నిర్మించనున్నారు. వేదిక ఏర్పాటుపై శుక్రవారం పాదయాత్ర సమన్వకర్త గరికపాటి మోహనరావు సంబంధిత వ్యక్తులతో చర్చించారు.

సభా మైదానాన్ని ఆరు కంపార్టుమెంట్లుగా విభజించనున్నట్టు చెప్పారు. ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియా, వీ వీఐపీలు, మహిళలకు ప్రత్యేకంగా ఎన్‌క్లోజర్లు నిర్మిస్తామన్నారు. అయితే మైదానాన్ని ఈనెల 21న అప్పగించనున్నందున ఆరోజు నుంచి పనులు చేపడతామని ఆయా సంస్థల ప్రతినిధులు శంకర్, చందరరావు వివరించారు.
పార్టీ అర్బన్ అధ్యక్షుడు వాసుపల్లి గణేష్‌కుమార్ తెలిపారు.