July 8, 2013

డల్లాస్‌లో తెలుగుదేశం పార్టీ సీడీ ఆవిష్కరణ

 అమెరికాలోని డల్లాస్ నగరంలోని ఓమిని హోటల్‌లో ఆదివారం తెలుగుదేశం పార్టీ సీడీ ఆవిష్కరణ జరిగింది. ఈ సందర్భంగా సినీ నటుడు నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభంజనాన్ని ఆపడం ఎవరి తరం కాదు అన్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని ఆయన అన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు 208 రోజుల పాటు 2817 కిలోమీటర్ల సుదీర్ఘ పాదయాత్ర చేసి నూతన రికార్డు సృష్టించారన్నారు. పాదయాత్రలోని ముఖ్య సన్నివేశాలు, తెలుగుదేశం పార్టీ పాటలు తదితర అంశాలతో కూడుకున్న సీడీని అట్లాంటా నగరానికి చెందిన మల్లిక్ మేదరమెట్ల రూపొందించారని తెలిపారు.

నరసరావుపేట పార్లమెంటు సభ్యులు మోదుగుల వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ ఒకవైపు పార్టీ కార్యక్రమాలను, మరోవైపు సేవా కార్యక్రమాలను చిత్తశుద్ధితో నిర్వహించడము అభినందనీయమన్నారు. రాష్ట్రాభివృద్ధి, భావితరాల భవిత కొరకు చంద్రబాబు తిరిగి ముఖ్యమంత్రి కావాలన్నారు. తెలుగుదేశం రాష్ట్ర కార్యదర్శి మన్నవ సుబ్బారావు మాట్లాడుతూ చంద్రబాబు చేపట్టబోతున్న బస్సుయాత్ర విజయవంతం అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందించి ఐటి రంగాన్ని అభివృద్ధి పరచడం ద్వారా తమకు ఉద్యోగ ఉపాధి లభించిందని ప్రవాసాం«ద్రులు అభిప్రాయపడుతున్నారని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మల్లిక్ మేదరమెట్ల, శ్రీనివాసరావు కొమ్మినేని, బుల్లియ్య చౌదరి ఉన్నవ, నాగరాజారావు మర్రి, మహేష్ గోగినేని, అమర్ అన్నె, లోకేశ్ నాయుడు తదితరులు పాల్గొన్నారు.