July 8, 2013

సోనియా గాంధీ అపాయింటుమెంట్ కోసం ఐదు రోజులు పడిగాపులు కాసిన కిరణ్ కుమార్ రెడ్డి!

వరంగల్: తెలంగాణ రాష్ట్ర సమితి వసూళ్ల పార్టీ అని, ఆ పార్టీ నాయకులు ఉద్యమం పేరుతో టిక్కెట్లు అమ్ముకుంటున్నారని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆదివారం తీవ్రస్థాయిలో మండిపడ్డారు. చంద్రబాబు ఆదివారం వరంగల్ జిల్లాలో పర్యటించారు. వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ మెజార్టీ సీట్లతో గెలుస్తుందని, కేంద్రంలో చక్రం తిప్పడం ఖాయమని అన్నారు.

పంచాయతీ ఎన్నికలలో పసుపు జెండా ఎగురవేయాలన్నారు. తొమ్మిదేళ్ల పాలనలో కాంగ్రెసు పార్టీ రాష్ట్రాన్ని నాశనం చేసిందన్నారు. ఏఐసిసి అధ్యక్షురాలు సోనియా గాంధీ అపాయింటుమెంట్ కోసం ఐదు రోజులు పడిగాపులు కాసిన ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఉత్తరాఖండ్ బాధితుల కోసం ఒక్కరోజును కేటాయించలేదన్నారు. తమ మహాలక్ష్మి పథకాన్నే బంగారుతల్లిగా మార్చారన్నారు.

టిడిపి అధికారంలోకి వచ్చాక తెలంగాణ ఉద్యమంలో అమరులైన విద్యార్థుల కుటుంబాలను ఆదుకుంటామన్నారు. విద్యార్థుల కుటుంబాలలో ఒకరికి ఉద్యోగమిస్తామన్నారు. విద్యార్థులు, ఉద్యోగుల పైన ఉన్న కేసులను ఎత్తివేస్తామన్నారు. రేపు, ఎల్లుండో పిల్ల కాంగ్రెసు తల్లి కాంగ్రెసులో కలువడం ఖాయమన్నారు. తెలంగాణ రాష్ట్ర సమితి వసూళ్ల పార్టీ అని, ఆ పార్టీకి సాధారణ ఎన్నికలలో గెలిచే సత్తా లేదన్నారు. తెరాస నాయకులు ఉద్యమం పేరుతో టిక్కెట్లు అమ్ముకుంటున్నారన్నారు. టిఆర్ఎస్ నేతల పైన ఎవరైనా ఆరోపణలు చేస్తే వారిపై దాడులు చేస్తారని, ఇదేం సంస్కృతి అని ప్రశ్నించారు.