July 5, 2013

తిరుపతిలో టీడీపీ ప్రాంతీయ సదస్సు రేపు

పంచాయతీ ఎన్నికలకు పార్టీ శ్రేణులను సమాయత్తపరిచే దిశగా శుక్రవారం తిరుపతిలో టీడీపీ ప్రాంతీయ సదస్సు జరగనుంది. రాయలసీమ జిల్లాలతో పాటు నెల్లూరు జిల్లా నుంచి హాజరు కానున్న పార్టీ శ్రేణులకు అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం చేయనున్నారు. ఇందుకు సంబంధించి గురువారం ఎమ్మెల్యేలు ముద్దుకృష్ణమ నాయుడు, బొజ్జల గోపాలకృష్ణారెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు జంగాలపల్లి శ్రీనివాసులు, మాజీ ఎమ్మెల్యే చదలవాడ కష్ణమూర్తి, నాయకులు నరసింహయాదవ్, మందలపు మోహన రావు తదితరులు ప్రాంతీయ సదస్సు జరిగే రామానాయుడు కల్యాణ మండపాన్ని పరిశీలించారు. సుమారు 20వేల మంది హాజరవుతారన్న అంచనాతో ఏర్పాట్లు చేస్తున్నారు.

చంద్రబాబు నాయుడు శుక్రవారం తిరుపతి చేరుకుంటారు. కాసేపు విశ్రాంతి తీసుకున్నాక పూతలపట్టు మండలం చిన్న బండపల్లెకు బయలుదేరి వెళతారు. ఉత్తరాఖండ్ హెలికాప్టర్ ఘటనలో మృతి చెందిన వీర జవాన్ వినాయకన్ ఇంటికి వెళ్ళి ఆయన కుటుంబ సభ్యులను పరామర్శిస్తారు. అక్కడి నుంచి బయలుదేరి 10 గంటలకు తిరుపతి చేరుకుని ప్రాంతీయ సదస్సుకు హాజరవుతారు.సాయంత్రం 5 గంటల వరకు సాగే సదస్సులో చంద్రబాబుతో పాటు పలువురు పార్టీ నేతలు ప్రసంగించనున్నారు.తరువాత ఉదయీ హోటల్‌కు చేరుకునే చంద్రబాబు అక్కడే బస చేస్తారు. రాత్రి జిల్లా టీడీపీ నాయకులతో పంచాయతీ ఎన్నికల్లో వ్యవహరించాల్సిన వ్యూహంపై సమీక్షిస్తారు. మరుసటి రోజు ఉదయం 7 గంటలకు బయలుదేరి స్పైస్ జెట్ విమానంలో హైదరాబాదుకు వెళతారు.