July 5, 2013

స్థానిక సంస్థల బలోపేతమే దేశం లక్ష్యం

 స్ధానిక సంస్ధలను బలోపేతం చేయడమే తమ పార్టీ లక్ష్యమని, దీన్ని గతంలో ఎన్‌టిఆర్‌ చేసి చూపారని, పంచాయితీలకు మంచివారిని ఎన్నుకోవాలని, రానున్న ఎన్నికల్లో అన్ని పంచాయితీ ల్లోనూ పార్టీ బలపరిచిన అభ్యర్ధులను గెలిపించాలని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు. స్ధానిక ఎన్నికలకు పార్టీ కార్యకర్తలు, నేతలను సమా యత్తం చేసేందుకు విజయవాడలో గురువారం కృష్ణా, గుంటూరు, ప్రకాశం, పశ్చిమ గోదావరి జిల్లాల ప్రాంతీయ సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు చంద్రబాబు ముఖ్య అతిధిగా హజరై కార్యకర్తలను ఉత్తేజపరుస్తూ ప్రసంగిం చారు. తొలుత టిడిపి వ్యవస్ధాపకులు ఎన్‌టిఆర్‌ విగ్రహా నికి పూలమాలవేశారు. దివంగత నేతలు ఎర్రన్నాయుడు, అంబటి బ్రాహ్మణయ్య ఫోటోలకు నివాళులర్పించారు.

ఉత్తరాఖండ్‌ మృతులకు సంతాపం తెలుపుతూ రెండు నిమిషాలు మౌనం పాటించారు. అనంతరం చంద్రబాబు మాట్లాడుతూ అధికారంలో ఉన్నా, లేకపోయినా ప్రజల కోసం పనిచేసేది తెలుగుదేశం మాత్రమేనన్నారు. పం చాయితీ సర్పంచిలుగా మంచివారిని ఎన్నుకుంటే వాటి రూపురేఖలు మారి ఆదర్శ గ్రామాలుగా మారుతాయ న్నారు. తండ్రి అధికార బలంతో కోట్లు మూట కట్టుకున్న పార్టీ వైకాపా అని, తెరాస సెటిల్‌మెంట్ల పార్టీ అని, కాం గ్రెస్‌ అధికారంలో ఉన్నా ఎందుకు పనికిరాని అసమర్ధ పా ర్టీ అని, ముఖ్యమంత్రికి ఏమీ తెలియదని, అసమర్ధుడని దుయ్యబట్టారు.రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక రాజ్యాంగబద్ద వ్యవస్ధలన్నింటిని నిర్వీర్యం చేసిందని, స్ధాని క సంస్ధలకు ఇదే కోవకు చెందుతాయని విమర్శించారు. వీటిని బలోపేతం చేస్తేనే గ్రామాల్లో ప్రజాస్వామ్యం ఫరిడ విల్లుతుందన్నారు. అధికార పార్టీ చేతగానితనంవల్ల కేంద్రం నుంచి రూ.4వేల కోట్లు రాకుండా పోయాయని మండిపడ్డారు.

దివంగత వైఎస్‌ సర్పంచ్‌లను ఉత్సవ విగ్ర హాలుగా మార్చి కాంగ్రెస్‌ కార్యకర్తలకు ఫలితాలను అం దించారని ఆరోపించారు. 1999లో టిడిపి హయాంలో స్ధానిక సంస్ధల బలోపేతానికి 89, 105 జీవోలను తెచ్చా మని, పంచాయితీలకు అధికారాల బదలాయింపుతోపా టు ఇసుకపై ఆదాయం కూడా అప్పగించామని గుర్తు చేశా రు. పంచాయితీల్లో బిసిలకు 50శాతం రిజర్వేషన్లు కల్పిం చాలని డిమాండ్‌చేశారు. నల్లధనం పోవాలంటే రూ. వెయ్యి, 500 నోట్లను రద్దుచేయాలని కోరారు. తమ ప్రభు త్వం అధికారంలోకివస్తే ప్రజా ధనాన్ని దోచుకున్నవారి వద్ద నుంచి ఆ సొమ్మును రికవరీచేసి ప్రజాసంక్షేమానికి విని యోగిస్తానని స్పష్టం చేశారు. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి ఓటేస్తే అది మురిగిపోతుందని, లేకపోతే ఆ పార్టీ నేతను కో ర్టు కేసుల నుంచి బయటకు తెచ్చుకోవడానికి వాడుకుం టారేగాని ప్రజలకు ఎటువంటి మేలు చేయలేరని విమర్శిం చారు. అధికార కాంగ్రెస్‌ గత 50ఏళ్ల నుంచి తెలుగువారి ఆత్మగౌరవాన్ని తాకట్టుపెడితే, దివంగత ఎన్‌టిఆర్‌ తెలుగు వారికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు, గౌరవం తెచ్చారన్నారు.

తమ పార్టీ కేవలం రాజకీయ పార్టీ మాత్రమే కాదని, ప్రజా సేవా దృక్పదంతో ముందుకు వెళుతున్నామని, ఇందులో భాగంగానే ఉత్తరాఖండ్‌, చార్‌దామ్‌లలో తెలుగువారు ఇబ్బందులు పడుతుంటే ప్రభుత్వానికంటే మిన్నగా సేవ లందించామని గుర్తుచేశారు. ఉత్తరఖాండ్‌లో చూసిన హృ దయవిదారక దృశ్యాలను ఆయన కళ్లకు కట్టినట్లు వివరిం చారు. తెదేపాను నాయకులే మోసం చేశారుతప్ప కార్యక ర్తలు కాదని, కార్యకర్తలవల్లనే ఎన్‌టిఆర్‌కు, తనకు గుర్తిం పు వచ్చిందన్నారు. 9ఏళ్ల కాంగ్రెస్‌ పాలనవల్ల రాష్ట్రం 30 ఏళ్లు వెనక్కిపోయిందని, వచ్చే ఎన్నికల్లో తల్లి, పిల్ల కాం గ్రెస్‌లను ఓడించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. తన హయాంలోని ఐఏఎస్‌ ఆఫీసర్లు కేంద్రంలో ఉన్నత స్ధానాల్లో ఉంటే వైఎస్‌తో పనిచేసిన వారు జైళ్లల్లో మగ్గు తున్నారని ఎద్దేవా చేశారు. ఏపిపిఎస్‌సిలో కాంగ్రెస్‌ కార్య కర్తలను సభ్యులుగా చేర్చి దాన్ని బ్రష్టుపట్టించారని, వారం దరి సభ్యత్వాలను రద్దుచేయాలని గవర్నర్‌ను కలిశామని, త్వరలో రాష్టప్రతిని కూడా కలుస్తామని ఆయన వెల్ల డించారు.

జగన్‌ అవినీతి చేశాడా? లేదో స్పష్టం చేయాలని వైకాపా నేతలను డిమాండ్‌ చేశారు. 2004లో వారి ఆస్తు లెంత? ఇప్పుడెంతో ప్రకటించాలని సవాల్‌ విసిరారు. దొం గ మంత్రులను కాపాడడంలో ఈ సీఎం బిజీగా ఉన్నారని, క్యాబినెట్‌ మంత్రుల పాపాలపై విచారణ చేయిస్తే 70 శాతం మంది జైళ్లలో ఉంటారన్నారు.అవినీతి లేకపోతే పేద రికం ఉండదని, పేదల కష్టార్జితం అవినీతిపరుల పాల వుతోందని ఆవేదన చెందారు.విద్యుత్‌ సమస్య పరిష్కారం, కేజి బేసిన్‌ గ్యాస్‌ మన అవసరాలకు ఉపయోగపడాలన్నా టిడిపినే గెలవాలని స్పష్టం చేశారు. రుణమాఫిపై మొదటి సంతకం, మద్య నియంత్రణపై రెండో సంతకం చేస్తానని మరోసారి నొక్కి వక్కాణించారు. దీన్ని గ్రామాల్లో కూడా ప్రచారం చేయమని పార్టీ కార్యకర్తలకు దిశానిర్దేశం చేశా రు.

ఈ నెలరోజులు నిద్రపోకుండా పార్టీ బలపరిచిన అభ్యర్ధులను గెలిపించేందుకు కృషిచేయాలని కోరారు. సదస్సులో కృష్ణా, గుంటూరు, పశ్చిమగోదావరి, ప్రకాశం జిల్లాల అధ్యక్షులు దేవినేని ఉమా, పత్తిపాట పుల్లారావు, సీతామహాలక్ష్మి, కరణం బలరామ్‌, బందరు ఎంపి కొనగళ్ల నారాయణ, మాజీ మంత్రులు కోడెల శివప్రసాదరావు, గో రంట్ల బుచ్చయ్యచౌదరి, ఆలపాటి రాజా, మాగంటి బాబు, నన్నపనేని రాజకుమారి, వైవిబి రాజేంద్రప్రసాద్‌, డాక్టర్‌ సి ఎల్‌ వెంకటరావ్‌, వర్ల రామయ్య, కాగిత వెంకటరావు, 4 జిల్లాల ఎంఎల్‌ఏలు,పార్టీనేతలు,కార్యకర్తలు పాల్గొన్నారు.