May 25, 2013

ఎండ దెబ్బకు మతిపోయింది: కెసిఆర్‌పై రేవంత్ రెడ్డి


హైదరాబాద్: తమ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావుపై తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి రేవంత్ రెడ్డి విరుచుకుపడ్డారు. ఎండ దెబ్బకు కెసిఆర్‌కు మతిపోయిందని ఆయన వ్యాఖ్యానించారు. నీచమైన భాషను కెసిఆర్ విద్యార్థులకు, ప్రజలు నేర్పుతున్నారా అని ఆయన శనివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో అడిగారు. కుక్క కాటుకు చెప్పు దెబ్బ ఎలా కొట్టాలో తమకు తెలుసునని ఆయన అన్నారు.

కెసిఆర్ కన్నా పరుషంగా తాము మాట్లాడగలమని, ఆయితే తమకు సభ్యత అడ్డు వస్తోందని ఆయన అన్నారు. తల తిక్క మాటలు మాట్లాడి తమ పార్టీని బలహీనపరుద్దామని కెసిఆర్ అనుకుంటే చెల్లదని ఆయన అన్నారు. తెరాస నుంచి వెళ్లిపోతున్నవారి గురించి కెసిఆర్ ఆలోచించాలని ఆయన అన్నారు. కెసిఆర్ వ్యవహారాన్ని రఘునందన రావు బయట పెట్టారని ఆయన అన్నారు.