May 25, 2013

వైఎస్‌లాంటి దోపిడీదారు సీఎం ఎక్కడా లేడు


  తాను దోచుకొని, తనను నమ్ముకున్న వారికి దోచిపెట్టిన ఘనత దివ ంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డికే దక్కుతుందని ఇలాంటి దోపిడీదారు సీఎం ఎక్కడా లేరని తెదేపా పొలిట్‌బ్యూరో సభ్యుడు కాలువ శ్రీనివాసులు విమర్శించారు. వైఎస్‌ఆర్‌ కడప జిల్లా వల్లూరులో శుక్రవారం తెదేపా జిల్లా మినీ మహానాడు, కమలాపురం ఇన్‌చార్జి పుత్తా నరసింహారెడ్డి పల్లెపల్లెకు పుత్తా విజయోత్సవ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్‌ జగన్‌కు ముఖ్యమంత్రి పదవి దక్కివుంటే వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ పుట్టేది కాదన్నారు. చంద్రబాబు మంత్రి పదవి ఇవ్వలేదనే కేసీఆర్‌ తెలంగాణ రాష్ట్ర సమితిని స్థాపించారన్నారు. సీఎం కుర్చీ కోసమే పుట్టిన అవినీతి పార్టీ వైకాపా అని విమర్శించారు. చంద్రబాబు తాము రైతుల రుణాలు మాఫీ చేస్తామని అంటుంటే ఇదేలా సాధ్యమవుతుందని సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి విమర్శిస్తున్నారని ఆయన ప్రజలకు మేలు చేయరు, ఇతరులు మంచి చేస్తామంటే ఒప్పుకోరని ఎద్దేవా చేశారు. రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్‌ మాట్లాడుతూ మినీ మహానాడు తీర్మానాల ద్వారా ప్రజలకు మరింత దగ్గరవ్వా లన్నారు. నాడు జగన్‌ను విమర్శిస్తూ పిట్ట కథలు చెప్పిన మైసూరారెడ్డి ఆయన పంచనే చేరడం సిగ్గుచేటన్నారు. అంతకుముందుగా భారీ ర్యాలీ నిర్వహించి వేదిక వద్దకు తెదేపా నేతలు తరలివచ్చి ఎన్టీఆర్‌ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈకార్యక్రమంలో తెదేపా జిల్లా అధ్యక్షుడు మల్లెల లింగారెడ్డి, ఎమ్మెల్సీ సతీష్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ పుత్తా నరసింహారెడ్డి, మాజీ మంత్రి పసుపులేటి బ్రహ్మయ్య తదితరులు పాల్గ్గొన్నారు.