May 25, 2013

టీడీపీ సెక్యులర్‌ పార్టీ..బీజేపీతో కలవం వచ్చేసారి గెలిచేది టీడీపీనే

అవిశ్వాసం పెడతాం
వామపక్షాలతో పొత్తులూ ఉంటారుు
రీేకంద్రంలోనూ థర్డ్‌ ఫ్రంట్‌ రావడం తథ్యం
రైతులకు పంట రుణాలు మాఫీ చేసి చూపిస్తాం
మహానాడు సందర్భంగా మీడియాతో
ఇష్టాగోష్ఠిలో చంద్రబాబు వ్యాఖ్యలు
టీఆర్‌ఎస్‌వి దౌర్జన్యాలు, బ్లాక్‌మెరుుల్‌, వసూళ్లే
రాష్ట్రాన్ని భ్రష్టూ పట్టించారని ధ్వజం
తెలంగాణ అమర వీరులకుటుంబీకులకు ఉద్యోగాలు
మహానాడుకు జూ.ఎన్టీఆర్‌, హరికృష్ణ వస్తారని ఆకాంక్ష
  అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాగానే ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టాలని భావిస్తున్నామని, దీనిపై పార్టీలో చర్చించి తుది నిర్ణయం ప్రకటిస్తామని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ గెలుపు తథ్యమని వందకు వందశాతం తామే గెలుస్తామని ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. ఈ నెల 27,28న పార్టీ మహానాడును పురస్కరించుకుని ఆయన తన నివాసంలో మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టిగా మాట్లాడారు. సుమారు గంట 15 నిమిషాలు సాగిన ఈ సంబాషణ ముఖ్యాంశాలు ఇవీ.పిల్ల కాంగ్రెస్‌ ప్రభావం తగ్గుతోందని, టీఆర్‌ఎస్‌ సాధారణ ఎన్నికల్లో గెలిచిన దాఖలాలు లేవని, కాంగ్సెస్‌కు ప్రభుత్వ వ్యతిరేకత ఓటు పోటు తప్పదని ఆయన విశ్లేషించారు. ఉప ఎన్నికల్లో అప్పుడో సీటు ఇప్పుడో సీటు ఖాతాలో వేసుకుంటున్న టీఆర్‌ఎస్‌ వసూళ్ల పార్టీగా మారిందని చంద్రబాబు నాయుడు ధ్వజమెత్తారు.
దౌర్జన్యాలు, బ్లాక్‌ మెయిల్‌తో రాష్ట్రంలోని పరిస్థితులను గందరగోళం సృష్టించడం ఆ పార్టీకి వెన్నతో పెట్టిన విద్యగా మారిందని తీవ్రంగా విరుచుకుపడ్డారు. పిల్ల కాంగ్రెస్‌ ఆగడాలు రోజు రోజుకు శృతి మించుతున్నాయన్నారు. తోక పార్టీలు అవిశ్వాసం పెడితే తాము వాటి వెంట వెళ్లబోమని ఆయన చెప్పారు.క్రిష్టియన్‌ ప్రాపర్టీస్‌ అన్నీ జగన్‌ కుటుంబ సభ్యులే దోచేస్తున్నారని మండిపడ్డారు. వైఎస్‌ మేనల్లుడు పీటర్‌ అధికారం లేకున్నా దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. ఆయన వెనుక జగన్‌, బ్రదర్‌ అనీల్‌ ఉన్నారన్నారు. ‘‘రైతులకు పంట రుణాలను మాఫీ చేసి చూపిప్తామన్నారు. 9 సంవత్సరాల అనుభవం నాది.. రెండు సంవత్సరాల అనుభవం కిరణ్‌కుమార్‌రెడ్డిది. వారికి ఎలా చేయాలన్నది కూడా తెలియదు’’ అని చంద్రబాబు నాయుడు అన్నారు. త్వరలో జరగనున్న మహానాడుకు ప్రత్యేక ప్రాధాన్యత ఉందన్నారు. పార్టీలో క్రమశిక్షణతో పని చేసే కార్యకర్తలు ఉన్నారన్నారు. ప్రాంతీయ పార్టీగా అవతరించిన తెలగుదేశం పార్టీ దేశ రాజకీయాలను శాసించిందని, కేంద్రంలో మూడు సార్లు కాంగ్రెసేతర పక్షాలు అధికారంలోకి వచ్చాయంటే తెలుగుదేశం పార్టీ చొరవే కారణమన్నారు.
2009లోనే నగదు బదిలీ గురించి తెలుగుదేశం పార్టీ వివరిస్తే దాన్ని కాంగ్రెస్‌ పార్టీ కాపీ కొట్టిందన్నారు. తెలుగుదేశం పార్టీకి రాష్ట్ర వ్యాప్తంగా బలమైన క్యాడర్‌ ఉందన్నారు. టీడీపీలో క్రమ శిక్షణ గల కార్యకర్తలు ఉన్నారన్నారు. తన కుమారుడు నారా లోకేశ్‌ సహా యువతను పార్టీలోకి ఆహ్వానిస్తామని బాబు తెలిపారు. వచ్చే ఎన్నికలకు ముందుగానే అభ్యర్థుల ఎంపిక ఉంటుందని వెల్లడించారు. కడియం శ్రీహరిని విశ్వాసం లేని నేతగా దూషించారు. ఆనాడు తెలంగాణపై ఇచ్చిన లేఖ బ్రహ్మాండంగా ఉందన్న కడియం, ఇప్పుడు దాన్ని రాజకీయం చేస్తున్నారని ఆరోపించారు. 2009లో తామిచ్చిన లేఖ ఆధారంగా టీఆర్‌ఎస్‌ తమతో పొత్తు పెట్టుకుందని గుర్తు చేశారు. ఆ లేఖకు కట్టుబడి ఉన్నామంటే తప్పుబడుతున్నారని మండిపడ్డారు.
ఉట్టికి ఎగరలేనమ్మ...!
ఉట్టికి ఎగరలేనమ్మ స్వర్గానికి ఎగురుతానన్నట్లుంది టీఆర్‌ఎస్‌ వైఖరి అని చంద్రబాబు నాయుడు దుయ్యబట్టారు. గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ ఎన్నికలకు కనీసం కార్పోరేటర్‌ అభ్యర్థులను కూడా పెట్టలేని వారు 100 అసెంబ్లీ సీట్లు ఎలా గెలుస్తారని బాబు ఎద్దేవా చేశారు. పిల్ల కాంగ్రెస్‌ నేతల వల్లే రాష్ట్రం భ్రష్టు పట్టిందని చంద్రబాబు ఆరోపించారు. మ్యాచ్‌ ఫిక్సింగ్‌ అంటూ నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. 2014లో థర్డ్‌ఫ్రంట్‌కు అవకాశాలు ఉన్నాయని సర్వేలు చేబుతున్నాయన్నారు. కమ్యూనిస్టులతో పొత్తులకు టీడీపీ సిద్దంగా ఉందని ఆయన ప్రకటించారు. ప్రభుత్వంపై పోరాటానికి అవిశ్వాస తీర్మానమే సరైందని భావిస్తే తప్పకుండా తామే అవిశ్వాసం పెడతామని వెల్లడించారు. అధికారంలోకి వచ్చాక తెలంగాణ అమర వీరుల కుటుంబాలను ఆదుకుంటామన్నారు. తనను తెలుగుదేశం పార్టీని దెబ్బతీయడానికే ఎన్టీఆర్‌ విగ్రహ ప్రతిష్టాపనను పురంధేశ్వరి వివాదాస్పదం చేసిందన్నారు.
అయినా తాను ఓర్పు వహించి విగ్రహం పార్లమెంటులో ఉండాలని కొంత సహనం వహించానన్నారు. ఎన్టీఆర్‌పై గౌరవంతోనే విగ్రహంపై వివాదం రేపినా వెనక్కి తగ్గామన్నారు. శంషాబాద్‌ ఏర్‌పోర్టుకు ఎన్టీఆర్‌ పేరు తొలగించినపుడు పురంధేశ్వరి ఎందుకు మాట్లాడలేదని చంద్రబాబు నాయుడు నిలదీశారు. హరికృష్ణ, జూనియర్‌ ఎన్టీఆర్‌లు మహానాడుకు హాజరుకావాలని, పార్టీ ఇబ్బందుల్లో ఉన్నప్పుడు అందరూ కలిసి పని చేయాలని చంద్రబాబు పిలుపు నిచ్చారు. పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు కూడా కలిసి రాక పోతే ఎలా అన్నారు. వారు వస్తారని తాను విశ్వసనీయంగా ఉన్నానన్నారు. కేంద్రంలో తృతీయ ఫ్రంట్‌ మాత్రమే కాంగ్రెస్‌కు ప్రత్నామ్నాయమని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అభిప్రాయపడ్డారు. ఏన్డీయేగానీ, యూపీఏ గానీ పెరగడం లేదని, ప్రాంతీయ పార్టీలే ఎదుగుతున్నాయని ఈ స్థితిలో కేంద్రంలో తృతీయ ఫ్రంట్‌ బలంగా ముందుకు వస్తుందని ఆయన అన్నారు. జాతీయ స్థాయిలో రాజకీయ పునరేకీకరణ జరుగుతోందన్నారు.
కేంద్రంలో మూడు సార్లు కాంగ్రెసేతర ప్రభుత్వాలు ఏర్పడడానికి తమ పార్టీయే కారణమని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీ విజయం చారిత్రక అవసరమని ఆయన అన్నారు. తమ పార్టీకి క్రమశిక్షణతో పని చేసే కార్యకర్తల బలగం దండిగా ఉందన్నారు. రాష్ట్రంలోనే కాకుండా దేశంలోనే ప్రాంతీయ పార్టీగా ఉండి కూడా ఉనికిని చాటుకుందన్నారు. తమ ప్రభుత్వ పాలనలో ప్రవేశపెట్టిన పథకాలను ఇతర రాష్ట్రాలు, కేంద్రం అనుసరించాయని ఆయన చెప్పారు. 2009లో తాము ప్రకటించిన నగదు బదిలీ పథకాన్ని కేంద్రం కాపీ కొట్టిందని ఆయన అన్నారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఎదుర్కొనేందుకు సిద్దంగానే ఉన్నామన్నారు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా తమ పార్టీని కార్యకర్తలే కాపాడుతున్నారన్నారు. నేతలు వలస వెళ్లినా కార్యకర్తలే పార్టీకి అండగా ఉన్నారన్నారు. మహిళలకు భద్రత, అన్ని వర్గాలకు సామాజిక న్యాయం కల్పించామన్నారు.
తాము నీతివంతమైన సమర్ధవంతమైన పాలన అందించామన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో జరుగుతున్న మహానాడుకు ప్రత్యేక ప్రాధాన్యం ఉందన్నారు. తాము గతంలో తెలంగాణ రాష్ట్ర సమితి, వామపక్షాలతో పొత్తు పెట్టుకున్నామని, ఇప్పుడు వామపక్షాలు ముందుకు వస్తే పొత్తుకు తాము సిద్ధంగా ఉన్నామని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో పొత్తుల గురించి మాట్లాడుతామని వామపక్షాలు అంటున్నాయని, అందువల్ల తాము తొందరపడ దలుచుకోలేదని అన్నారు. తమ పార్టీని బలోపేతం చేసుకోవడానికి ప్రయత్నాలను సాగిస్తున్నామన్నారు. తెలంగాణపై తమ లేఖను చూసిన తర్వాతనే టీఆర్‌ఎస్‌ 2009లో టీడీపీతో పొత్తు పెట్టుకుందన్నారు. పశువులకు ఉన్న కృతజ్ఞత కూడా జంప్‌ జిలానీలకు లేదని, తమ ఇంట్లో కష్టాలు ఉంటే గోడ దూకేస్తారా అని ఆయన ప్రశ్నించారు. ముందుగానే అభ్యర్థులను ప్రకటిస్తామని, 2014 సీట్లపై, పొత్తులపై తమకు స్పష్టత ఉందని పేర్కొన్నారు. తెలంగాణపై గతంలో ఇచ్చిన లేఖకు కట్టుబడి ఉన్నామని, టీఆర్‌ఎస్‌ విమర్శలను తమ పార్టీ నేతలు రాజకీయ కోణంలోనే చూడాలని చంద్రబాబు అన్నారు.

కేసిఆర్‌ చేసిందేమీ లేదు...
టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కేసిఆర్‌ కేంద్ర మంత్రి ఉండి కూడా తెలంగాణకు చేసిందేమీ లేదన్నారు. బీడీ కట్టలపై పుర్రె గుర్తును కూడా వ్యతిరేకించని కేసిఆర్‌కు వసూళ్లు, బ్లాక్‌ మెయిల్‌ తప్ప మరేం తెలియదన్నారు. ఆయన స్థాయికి దిగజారీ మాట్లాడడం తమకు వచ్చని.. అయితే సంస్కారం అడ్డువస్తుందని పేర్కొన్నారు. టీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పార్టీల్లోకి ఎమ్మెల్యేలు ఎందుకు మారుతున్నారన్న ప్రశ్నకు సమాధానం ఇస్తూ అణు ఒప్పందాన్ని తెలుగుదేశం పార్టీ వ్యతిరేకిస్తే ఆ బిల్లును ఎలా అయినా సరే పాస్‌ చేయించుకోవాలన్న నిర్ణయానికి వచ్చిన కాంగ్రెస్‌ సంతలో పశువులను కొన్నట్లు తమ ఎంపీలను కొనేసిందన్నారు. అలాంటి వారు మళ్లీ ఇప్పుడు ఇంకో పార్టీ మారతామంటున్నారని వీరికి విలువలు ఉన్నాయా? అని మండిపడ్డారు. అధికారంలోకి వస్తే తెలంగాణ అమర వీరులకుటుంబాలకు ఉద్యోగాలు ఇస్తామని చంద్రబాబు నాయుడు అన్నారు.
లోకేష్‌కు లైన్‌ క్లీయర్‌...!
రానున్న ఎన్నికల్లో తన తనయుడు నారా లోకేశ్‌ రాజకీయ ఆరంగేట్రం చేసేందుకు చంద్రబాబు లైన్‌ క్లీయర్‌ చేశారు. యువతకు 30 శాతం సీట్లు ఇస్తామని చెప్పామని, ఉత్సాహం ఉన్న వారు ఎవరైనా దరఖాస్తు పెట్టుకోవచ్చని, పరిశీలించాక పార్టీ తుది నిర్ఱయం తీసుకుంటుందన్నారు. అందులో లోకేశ్‌ కూడా ఉండవచ్చని అన్నారు. లోకేష్‌నేకాదు యువతను అందరినీ ఆహ్వానిస్తానన్నారు.
సాక్షి.. టీ న్యూస్‌ను బహిష్కరిస్తాం
తనపై అసత్య వార్తలను పేజీలకు పేజీలు వండి వారుస్తున్న సాక్షి పత్రికను బహిష్కరించాల నుకుంటున్నా మన్నారు. వ్యక్తిగత కక్షతో వార్తలు రాస్తున్న ఆ పత్రిక, టీవీ ఛానల్‌ పాత్రికేయులు ఇకపై టీడీపీ ప్రెస్‌మీట్‌లకు ఆహ్వానాలు పంపించాల్సిన అవసరం లేదని మీడియా కమిటీ ఛైర్మన్‌ ఎల్‌విఎస్‌ఆర్‌కే ప్రసాద్‌ను ఆదేశించారు. వారిని పిలిపించుకుని తమ పూడికలన్నీ కడిగించుకోవాల్సిన అవసరం ఉందంటారా? అని మీడియాకు ఎదురు ప్రశ్న వేశారు. భావ ప్రకటనా స్వేచ్ఛను గౌరవించాలని ఇన్నాళ్లూ ఓపిక వహించామని.. మహానాడులో చర్చించి సాక్షి, టీ ఛానల్‌ నిశేధంపై తుది నిర్ణయాన్ని వెలువరుస్తామన్నారు.