April 8, 2013

ఫ్లెక్సీల వివాదంపై హరికృష్ణ అసహనం

వరంగల్ : ఫ్లెక్సీల వివాదంపై టీడీపీ ఎంపీ
హరికృష్ణ అసహనం వ్యక్తపరిచారు. సోమవారం ఉదయం జిల్లాలోని మల్లూరు హేమచల నర్సింహస్వామిని హరికృష్ణ సతీసమేతంగా దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ పార్టీ వ్యవహారాలపై మీరు అడగాల్సింది తాను చెప్పాల్సింది చాలా ఉందని, త్వరలో మీడియాతో అన్ని వివరాలు వెల్లడిస్తానని ఆయన తెలిపారు. దైవ సన్నిధిలో వివాదాలపై మాట్లాడటం సరికాదన్నారు.

ఎన్టీఆర్ ఫోటోను పెట్టుకోవడం రాజకీయ వ్యభిచారం అనడం తప్పని, ఆనాడు ఎన్టీఆర్ ఫోటోను పెట్టనివారిని ఏమనాలని ప్రశ్నించారు. ఎవరైనా ఎన్టీఆర్ ఫోటోను పెట్టుకోవచ్చని ఆయన తెలిపారు. ఎన్టీఆర్ ఫోటో పెట్టుకోవడం వారి వ్యక్తిగతం అని హరికృష్ణ వెల్లడించారు. జూనియర్ ఎన్టీఆర్‌కు ఫ్లెక్సీల్లో ఫోటోతో సంబంధంలేదన్నారు, టీడీపీలోనే ఉంటానని జూ.ఎన్టీఆర్ ఏనాడో చెప్పారని గుర్తు చేశారు. ఎవరో చేసినదానికి జూ.ఎన్టీఆర్ బాధ్యుడు కాదని హరికృష్ణ స్పష్టం చేశారు.