March 8, 2013

చంద్రబాబుకు ఘన స్వాగతం పలుకుదాం

ఏలూరుకార్పొరేషన్: తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు వస్తున్నా మీకోసం పాదయాత్రకు జిల్లాలో ప్రవేశించే తరుణంలో ఏలూరు నియోజకవర్గం నుంచి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో వెళ్ళి ఘన స్వాగతం పలుకుదామని ఏలూరు నియోజకవర్గం టీడీపీ కన్వీనర్ అంబికా కృష్ణ అన్నారు. గురువారం రాత్రి ఏలూరు పవరుపేటలోని అంబికా భవన్ వద్ద ఏర్పాటు చేసిన నాయకులు, కార్యకర్తల సమావేశానికి నగర కార్యదర్శి కొల్లేపల్లి రాజు అధ్యక్షత వహించారు.

ఈ సందర్భంగా అంబికా కృష్ణ మాట్లాడుతూ చంద్రబాబు పర్యటనకు ఇతర జిల్లాల్లోజరిగిన స్వాగతాంజలి కంటే మన జిల్లా నుంచి ఘన స్వాగతం పలకాలని, ఇందుకోసం యువత, మహిళలు పెద్ద సంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు. కార్యకర్తలకు, నాయకులకు తగు సౌకర్యాలు కలుగజేస్తామని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలు విసుగుచెంది ఉన్నారని, తెలుగుదేశం పార్టీ పాలన కోసం ప్రజలు నిరీక్షిస్తున్నారని, ఈ తరుణంలో చంద్రబాబు జిల్లాకు రావడం, పార్టీకి శుభపరిణామమన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పాలి ప్రసాద్, ఉప్పాల జగదీష్‌బాబు, బంకా రామ్మోహనరావు, లుకలాపు సత్యనారాయణ, నెర్సు గంగరాజు, ఇక్బాల్, పైడేటి రఘు, జంపా సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. వివిధ డివిజన్ల నుంచి నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు.