March 8, 2013

చంద్రబాబు యాత్రను విజయవంతం చేయాలి

తుని: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు నిర్వహిస్తున్న 'వస్తున్నా మీకోసం' పాదయాత్రను విజయవంతం చేయాలని ఆ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు పిలుపు నిచ్చారు. ఈ మేరకు ఆయన కార్యకర్తలతో సమా వేశమయ్యారు. రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా నడిపించేందుకు ప్రణాళికలు రూపొందించిన నేత చంద్రబాబు అని కొనియాడారు. పదేళ్ళుగా కాంగ్రెస్ కబంధ హస్తాల్లో నలిగిపోతున్న ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు ఆయన వస్తున్నారన్నారు.

ఆయన యాత్రను కార్యకర్తలంతా సైనికుల్లా పనిచేసి విజయవంతం చేయాలని పిలుపు నిచ్చారు. రాష్ట్రాన్ని తిరిగి అభివృద్ధి పట్టాలపైకి ఎక్కించే సత్తాగల నేత చంద్రబాబేనని అన్నారు. మెట్టలోని సమస్యల పరిష్కారానికి పార్టీ విశేష కృషి చేస్తుందన్నారు. పోల్నాటి శేషగిరిరావు, సుర్ల లోవరాజు, యినుగంటి సత్యనారాయణ, సూరంపూడి అప్పారావు, కూరపాటి రఘు, రాపేటి సూరిబాబు, కుచ్చర్లపాటి జగన్నాథరాజు, కుక్కడపు బాలాజీ, యనమల శివరామకృష్ణన్, పప్పు సత్యనారాయణ, చింతంనీడి అబ్బాయి, నడిగట్ల సూరిబాబు, ఆడారి ఈశ్వరరావు, అంకంరెడ్డి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.

స్థానిక ఎన్నికల్లో సత్తా చూపాలి

తునిరూరల్: రాబోయే స్థానిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ సత్తా చూపించేందుకు కార్యకర్తలంత కృషి చేయాలని పొలిట్‌బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు అన్నారు. పార్టీ కార్యాలయంలో గురువారం గ్రామాల వారీగా సమీక్ష సమావేశాన్ని ఆయన నిర్వహించారు. తొండంగి మండలం పీఈ చిన్నయ్యపాలెం, ఎ.కొత్తపల్లి, తుని మండలం టి.తిమ్మాపురం, తేటగుంట, ఎన్ఎస్‌వీ.నగరం, ఎస్. సూరవరం గ్రామాల నాయకులు, కార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ స్థానిక ఎన్నికల్లో ఏ అభ్యర్థిని నిలబెట్టిన గెలుపుకోసం ప్రతి ఒక్కరూ కష్టపడి పని చేయాలన్నారు. టీడీపీలో చేసిన పనులు తప్ప కాంగ్రెస్ ఏం చేశారన్నది ప్రజల్లోకి తీసుకెళ్ళాలన్నారు. అవినీతి రహితమైన పాలన కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారని అది ఒక్క చంద్రబాబు వల్లే సాధ్యమన్నారు. చంద్రబాబు పాదయాత్రతో సానుకూల పవనాలు వీస్తున్నాయని, వీటిని స్థానిక ఎన్నికల విజయానికి వినియోగించాలన్నారు. పోతుల వీర్రాజు, వెలుగుల శేషరావు, కాపారపు అబ్బులు, దాట్ల వర్మ, సీహెచ్. అబ్బాయి, యడ్ల అప్పలరావు, పంపనబోయిన నర్సింహమూర్తి తదితరులు పాల్గొన్నారు.