January 8, 2013

ఆ తపనే నడిపిస్తుంది



 అనారోగ్యాన్ని సైతం లెక్క చేయక, అలసటనూ అధిగమిస్తూ 63 ఏళ్ల వయసులోనూ టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు సాగిస్తున్న పాదయాత్ర కొత్త చ రిత్రను సృష్టిస్తోంది. ప్రజలతో మమేకమవుతూ వారి సమస్యలను తెలుసుకుంటూ 'వస్తున్నా.. మీ కోసం' అని సాగుతున్న చంద్రబాబు యాత్ర అట్టడుగు వర్గాలకు భరోసాగా నిలుస్తోందంటున్నారు టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, పాదయాత్ర సమన్వయ కర్త గరికపాటి మోహన్‌రావు. బాబు గతంలో చేపట్టిన పాదయాత్రను పర్యవేక్షించిన మోహన్‌రావు ఈసారి కూడా ఆ బాధ్యతలనే చూసుకుంటున్నారు. బుధవారంతో చంద్రబాబు పాదయాత్ర వందో రోజుకు చేరుకుంటున్న సందర్భంగా ఆయన అభిప్రాయాలు ఆయన మాటల్లోనే..

తొలి అడుగు..

గత సంవత్సరం అక్టోబర్ 2. ఒక మహా సంకల్పం కార్యరూపం దాల్చింది. ప్రజా సమస్యలను స్వయంగా తెలుసుకునేందుకు చంద్రబాబు నాయుడు చేపట్టిన సుదీర్ఘ పాదయాత్రకు తొలి అడుగు పడింది. ఖమ్మం జిల్లాలో వందో రోజుకు కూడా చేరుతోంది. యాదృచ్ఛికంగా టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ కూడా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసింది సరిగ్గా అదే రోజు(1983 జనవరి 9) కావడం గమనార్హం.

కాళ్లకు బొబ్బలెక్కినా..

శారీరకంగా తీవ్ర అలసటకు లోనైనా, అస్వస్థతకు గురైనా బాబు దృఢ సంకల్పం ఎక్కడా సడలలేదు. పాదయాత్ర తొలినాళ్లలో ఆయన కాళ్లకు బొబ్బలొచ్చాయి. చితికి పుండ్లయ్యాయి. కాళ్ళు వాపెక్కాయి. అడుగు తీసి అడుగుపెట్టలేని పరిస్థితి. అయినా పాదయాత్రను కొనసాగిస్తూనే వచ్చారు. కాలిబొటన వేలి గాయం ఇప్పటికీ ఆయనను బాధిస్తూనే ఉంది. ఆయన అవస్థ చూస్తుంటే మాకే ఎంతో బా«ధేస్తోంది. బాబు మాత్రం చిరనవ్వుతో ముందుకు కదులుతున్నారు.

ఆ తపనే నడిపిస్తోంది..

బాబు ఆలోచనలు నిరంతరం ప్రజా సమస్యలపైనే. ఆయన ఆవేదనంతా వారు ఎదుర్కొంటున్న ఇబ్బందులపైనే. పాదయాత్రలో వారి కష్టాల గురించి తరిచి తరిచి అడుగుతుండటం చూస్తుంటే బాబు పడుతున్న తపన ప్రతి ఒక్కరికీ స్పష్టంగా కనిపిస్తోంది. అన్ని రంగాలు కుప్పకూలిన, అన్ని వ్యవస్థలు పతనమైన ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజలకు ఏమైనా చేయాలనే దృఢ దీక్షే ఆయనను మరింత ముందుకు నడిపిస్తోంది.

వేదన కలిగించింది..

పాదయాత్రలో బాబు అనారోగ్యానికి గురికావడం మమ్మల్ని మనోవేదనకు గురి చేసింది. అప్పటికే కాళ్ళనొప్పులు, మడమల వాపుతో బాధపడుతున్న బాబు షుగర్ స్థాయి ఉన్నట్టుండి ఒక్కసారిగా పెరగడం ఆందోళనకు గురిచేసింది. స్వల్ప విశ్రాంతి తర్వాత మళ్ళీ మామూలు స్థాయికి చేరుకోవడంతో ఎంతో ఊరట చెందాం. పార్టీ సీనియర్ నేత ఎర్రంనాయుడు హఠాన్మరణం కూడా బాబుతో పాటు అందరినీ చాలా కుంగదీసింది.

మైలు రాళ్లు..

చంద్రబాబు పాదయాత్ర అనేక మైలురాళ్లను దాటింది. 54 ఏళ్ల వయసులో వైఎస్ 68 రోజుల పాటు 1468 కిలోమీటర్లు నడిచి రికార్డు సృష్టిస్తే.. 63 ఏళ్ల వయసులో చంద్రబాబు ఆ రికార్డును బద్దలు కొట్టారు. మరో వెయ్యి కిలో మీటర్లు కూడా నడుస్తారు. ఈ రికార్డును సమీప భవిష్యత్తులో మరో నాయకుడు బద్దలు చేసే అవకాశమే లేదు. ఉండదు కూడా.

యాత్రకు బ్రహ్మరథం

పాదయాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. చంద్రబాబును కలుసుకొని తమ సమస్యలను నివేదిస్తున్నారు. అనేక సమస్యలపై తమ గోడును వెల్లబోసుకుంటున్నారు. ఇప్పటివరకు ప్రజల నుంచి 8600 వినతి పత్రాలు అందాయి. వీటిపై సంబంధిత జిల్లా కలెక్టర్లు, ఎంపీలు, ఎమ్మెల్యేలకు అప్పటికప్పడు రాసి పంపిస్తున్నాం. పాదయాత్రలో బాబు దృష్టికి వచ్చిన ప్రతీ ప్రజా సమస్యను రికార్డు చేస్తున్నాం.

ఆదుకునే నాయకుడు..

పాదయాత్ర జరుగుతున్న సమయంలోనే తెలంగాణపై అఖిలపక్ష సమావేశంలో మా వైఖరిని మరోసారి విస్పష్టంగా ప్రకటించడం గుర్తుండిపోయే అంశం. అప్పుడూ ఇప్పుడూ ఎప్పుడూ కూడా తెలంగాణ ప్రజలు టీడీపీ వెంటే ఉంటారు. పాదయాత్రకు తరలివస్తున్న జనమే ఇందుకు నిదర్శనం. రాష్ట్ర ప్రజలు అనేక బాధలు పడుతున్నారు. ఇన్ని సమస్యలను ఎప్పుడూ ఎదుర్కోలేదు. తమను ఆదుకునే నాయకుడి కోసం వారు ఆశతో, ఆతృతతో ఎదురుచూస్తున్నారు. ఆ నాయకున్ని వారు చంద్రబాబులో చూస్తున్నారు.