January 8, 2013

గుక్కెడు గంగ లేని తండాలెన్నో!



ఆరు పదులు దాటిన స్వాతంత్య్ర భారతంలో ఇప్పటికీ పల్లె గొంతుక తడవకపోవడం ఎంత దారుణం! ఈ రోజు ఎక్కువభాగం తండాల మీదుగానే సాగాను. ఎర్రబెల్లి గూడెం, కాచికల్ గ్రామాల్లో చాలామంది గిరిజన మహిళలు ఎదురొచ్చి కష్టాలు చెప్పుకున్నారు. దాదాపు అందరూ తాగునీటి సమస్యను పదేపదే నా దృష్టికి తెచ్చే ప్రయత్నం చేశారు. ఏది లేకపోయినా సరిపెట్టుకోవచ్చు. చివరకు గంజి లేకపోయినా నాలుగైదు రోజులు తట్టుకోవచ్చు.

కానీ, దాహం వేసినప్పుడు గుక్కెడు నీళ్లు ఇవ్వలేకపోవడం ఏమిటి? 1,50,000 కోట్ల బడ్జెట్ అని గొప్పగా చెప్పుకునే అర్హత అసలు ఈ ప్రభుత్వానికి ఉన్నదా? " సారూ..ఏమని చెప్పాలి..దూప వేస్తే తాగేందుకు గంగ లేదు. మంచినీరు లేదని గొంతు ఎండకుంటుందా? దొరికిన నీళ్లు తాగి బిమారయితే దవాఖానా ఉండదు. ఒకటీ అర ఉన్నా వైద్యులు ఉండరు. వాళ్లూ ఉన్నారనుకుంటే మందులు ఉండవు. పోనీ టౌన్‌కు వెళదామంటే ఊరికి సరైన రోడ్డే లేదు. జరూరు పడితే 108 వాహనం వచ్చిపోవడమూ కష్టమే'' అంటూ వాపోయారు.

నేను ఈ జిల్లాలో అడుగుపెట్టినప్పటినుంచీ చూస్తున్నాను..ఏ పల్లెకూ ఏ తండాకూ కచ్చా దారులు తప్ప పక్కా రోడ్లు లేవు. మంచినీటి గుంటల్లో పాచి పేరుకుపోయింది. డ్రైనేజీ లేక గుడిసెల ముందు మురుగు మడుగు కట్టడం గమనించాను. ఈ తండాలు రాష్ట్రంలో భాగమే కాదన్నట్టు పాలకుల తీరు ఉంటోంది. ఇప్పుడే ఇలా ఉంటే వేసవిలో ఇంకెంత దారుణంగా ఉంటుందో! దీన్ని దృష్టిలో ఉంచుకొనే ఎన్టీఆర్ సుజల పథకం ప్రకటించాను. రైతు రుణాల మాఫీ, బెల్టు షాపుల ఎత్తివేత తరువాత ఈ అంశానికే నా ప్రాధాన్యం!

దారిపొడవునా కులసంఘాలు, వివిధ స్వచ్ఛంద సంస్థలు నాతో పాటు నడిచి సంఘీభావం తెలిపాయి. వారి అభిమానం వెల కట్టలేనిది. మహిళలు బోనాలతోనూ, గీత కార్మికులు మోకులతోనూ, మత్స్యకారులు వలలతోనూ, గొర్రెల కాపరులు గొర్రె పిల్లలతోనూ నాకు స్వాగతం పలికారు. వీరందరికి నేనెంత రుణపడిపోతున్నాను!