June 29, 2013

పేదల కష్టాలకు చిరంజీవే కారణం: అశోక్ గజపతిరాజు

రాష్ట్రంలో పేద ప్రజల కష్టాలకు కేంద్రమంత్రి చిరంజీవే కారణమని తెలుగుదేశం పార్టీ శాసనసభాపక్ష ఉపనేత పూసపాటి అశోక్ గజపతిరాజు అన్నారు. విజయనగరం జిల్లా డెంకాడ మండలం పెదతాడివాడ పంచాయతీ గుండాలపేటలో స్థానికులు ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ విగ్రహాన్ని అశోక్ శనివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ పాలనపై విసిగి ప్రజలు టీడీపీకి అధికారాన్ని కోరుకుంటున్న సమయంలో చిరంజీవి ప్రజారాజ్యాన్ని స్థాపించి, ఓట్లను చీలిక చేశారని పేర్కొన్నారు.

'పులినిచూసి నక్క వాతలు' పెట్టుకున్నట్టుగా ఎన్టీఆర్‌లా తాను కూడా ముఖ్యమంత్రి అయిపోవాలని కలలుగన్న చిరంజీవి ఎన్నికల్లో పార్టీ బోల్తాపడడంతో దుకాణం మూసేశారని ఎద్దేవా చేశారు. చిరంజీవి తనను నమ్ముకున్నవారిని నట్టేట ముంచి, తాను మాత్రం కేంద్రమంత్రి అయ్యారని అన్నారు. వెండితెరపైగాని, రాజకీయాల్లో గాని రియల్ హీరో ఒక్క ఎన్టీఆరేనని అశోక్ పేర్కొన్నారు.