April 9, 2013

కాంగ్రెస్‌ను గద్దెదించాలి

జిన్నారం: ప్రజావ్యతిరేక విధానాలు అవలంబిస్తున్న కాంగ్రెస్ పార్టీని గద్దె దించాలని టీడీపీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు ప్రజలకు పిలుపునిచ్చారు. 'పల్లెపల్లెకు తెలుగుదేశం' కార్యక్రమంలో భాగంగా సోమవారం రాత్రి మాదారం గ్రామంలో నిర్వహించిన కార్యక్రమంలో మైనంపల్లి హన్మంతరావు పాల్గొన్నారు. గ్రామంలో పార్టీ జెండాను ఆవిష్కరించిన అనంతరం ఆయన మాట్లాడుతూ, తొమ్మిది సంవత్సరాల కాంగ్రెస్ పాలన అన్ని రంగాలకు నష్టం కల్గించిందన్నారు. రాజ్యాంగ వ్యవస్థలు పూర్తిగా భ్రుష్టుపట్టాయని ఆరోపించారు.

చంద్రబాబు హయాంలో కరువు పరిస్థితులు నెలకొన్నా విద్యుత్, ఇతర రంగాలను సమర్థవంతంగా నిర్వహించామని గుర్తు చేశారు. మరోసారి టీడీపీ అధికారంలోకి తీసుకువచ్చేందుకు కార్యకర్తలు కృషి చేయాలని సూచించారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన పార్టీ రాష్ట్ర కార్యదర్శి చంద్రారెడ్డి మాట్లాడుతూ వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలలో మండలంలోని అన్ని సర్పంచ్ స్థానాలను గెలుచుకునేందుకు సమన్వయంతో పని చేయాలన్నారు. కాంగ్రెస్ అసమర్థ విధానాలను ప్రజలకు వివరించాలని సూచించారు. ఈ సమావేశంలో పార్టీ నాయకులు సఫాన్‌దేవ్, శశికళాయాదవరెడ్డి, శ్రీనివాస్‌గౌడ్‌లు మాట్లాడారు. కార్యక్రమంలో నాయకులు చిమ్ముల గోవర్ధన్‌రెడ్డి, వరప్రసాద్‌రెడ్డి, దేవేందర్‌రెడ్డి, మద్దుల బాల్‌రెడ్డి, మహిరాజ్, ఎంపీ.అశోక్, రాజిరెడ్డి, జనార్ధన్‌రెడ్డి, సూర్యనారాయణ, సురేందర్‌గౌడ్, విశ్వనాథం, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.