April 9, 2013

చంద్రబాబుతోనే అభివృద్ధి సాద్యం

అనంతగిరి: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని రంగారెడ్డి జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శి జి.సుభాష్‌యాదవ్ అన్నారు. వికారాబాద్ పట్టణంలోని గంగారం, ఎన్నెపల్లి, కొత్రేపల్లి గ్రామాలలో పల్లె పల్లెకు తెలుగుదేశం పార్టీ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ పతాకాలను ఎగురవేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో సుభాష్ యాదవ్ మాట్లాడుతూ పట్టణంలో నెలకొన్న సమస్యలు మంత్రికి పట్టడం లేదన్నారు. మంత్రి వికారాబాద్‌కు వచ్చినప్పుడు సమస్యలపై నిలదీయాలన్నారు. టీడీపీ అధికారంలోకి వస్తే రుణాలన్నీ మాఫీ చేస్తారని అన్నారు.

టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి పి.విజయ్‌కుమార్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య తీవ్రమైందన్నారు. చంద్రబాబు హయాంలో ఎంత అభివృద్ధి జరిగిందో, ప్రస్తుతం ఎంత అభివృద్ధి జరిగిందో ప్రజలు ఒకసారి ఆలోచన చేయాలన్నారు. పార్టీ పట్టణ అధ్యక్షుడు హెచ్.సురేష్ మాట్లాడుతూ చంద్రబాబునాయుడు రంగారెడ్డి జిల్లాను అభివృద్ధి చేస్తే వైఎస్ అధికారంలోకి వచ్చాక జిల్లాను మొత్తం దోచుకున్నాడని విమర్శించారు. కార్యక్రమంలో జిల్లా పార్టీ ఉపాధ్యక్షుడు కొండల్‌రెడ్డి, కొత్తగడి పీఏసీఎస్ చైర్మన్ అనంత్‌రెడ్డి, నాయకులు లక్ష్మణ్‌రావు, ప్రభాకర్‌రెడ్డి, వెంకటేష్, ప్రభుగౌడ్, ఉమాశంకర్ , మల్లికార్జున్, ఎంవీ రమణ, సుధాకర్‌రెడ్డి, శ్రీకాంత్, డి.రవికుమార్ పాల్గొన్నారు.