April 28, 2013

అవినీతి మంత్రులను కాపాడటంలో కిరణ్ బిజీ...

విశాఖపట్నం : కిరణ్‌వి అన్నీ ఉత్తుత్తి వాగ్దానాలే అని చంద్రబాబు ఎద్దేవా చేశారు. అవినీతి మంత్రులను కాపాడటంలో ఆయన బిజీగా ఉన్నారన్నారు. "ఒకప్పుడు ఢిల్లీకి వచ్చిన విదేశీ ప్రముఖులు అభివృద్ధి చూసేందుకు ఆంధ్రప్రదేశ్‌కు వచ్చేవారు. ఇప్పుడు రాష్ట్రాన్ని అవినీతి రాజధానిగా మార్చారు. సాక్షాత్తూ హోం మంత్రే ముద్దాయిగా ఉన్నారు. అవినీతి మంత్రులు సచివాలయంలో కూర్చుంటున్నారు.

ఇక చట్టాన్ని ఎలా అమలు చేస్తారు? వీరికి నైతిక విలువలు లేవా?'' అని చంద్రబాబు నిలదీశారు. వైఎస్ చేసిన తప్పుల్లో మంత్రులూ భాగస్వాములే అని, 26 వివాదాస్పద జీవోలు జారీ చేయడంలో వీరి పాత్ర ఉందని తెలిపారు. బయ్యారం గనులు, బ్రహ్మణీ భూముల లీజులను రద్దు చేసామని పోజులు కొడుతున్న కిరణ్... జగన్ దోచిన సొమ్మును ఎందుకు రికవరీ చేయడం లేదని నిలదీశారు. దోచుకున్న ఆస్తులు ఎందుకు స్వాధీనం చేయడంలేదని ప్రశ్నించారు. రేపోమాపో చేతులు కలపాలన్న కుతంత్రపు ఆలోచనలే దీనికి కారణమన్నారు.