April 28, 2013

టీడీపీ బహిరంగసభకు విస్తృత ఏర్పాట్లు

శంషాబాద్: శంషాబాద్‌లో ఆదివారం జరిగే చంద్రబాబునాయుడు బహిరంగ సభ కోసం తెలుగుతమ్ముళ్లు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు. శంషాబాద్ ఆర్టీసీ బస్టాండు సమీపంలోని హైదరాబాద్ - బెంగళూరు జాతీయ రహదారిపై మధ్యాహ్నం 2.45 గంటలకు బహిరంగ సభ ప్రారంభమవుతుంది. వస్తున్నా మీకోసం పాదయాత్ర ముగించుకుని విశాఖపట్టణం నుంచి మధ్యాహ్నం 2.30 గంటలకు చంద్రబాబు శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుంటారు. అక్కడ తెలుగుదేశం శ్రేణు లు బాబుకు ఘనస్వాగతం పలికి ఊరేగింపుగా శంషాబాద్‌లోని బహిరంగ సభా వేదికకు చేరుకుంటారు.

2.45 గంటలకు సభ ప్రారంభమవుతుంది. బహిరంగ సభను పూర్తిస్థాయి లో విజయవంతం చేయడం కోసం టీడీపీ జిల్లా అధ్యక్షుడు పట్నం మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే టీ.ప్రకాష్‌గౌడ్, పార్టీ రాష్ట్ర కార్యదర్శి బుక్కా గోపాల్, జిల్లా తెలుగు యువత అధ్యక్షుడు ఆర్.గణేశ్‌గుప్తా, పార్టీ మండల అధ్యక్షుడు కోడిగంటి చంద్రారెడ్డి, టౌన్ ప్రసిడెంట్ దూడల వెంకటేష్‌గౌడ్, సింగిల్‌విండో చైర్మన్ కె.మహేందర్‌రెడ్డి తదితరులు బహిరంగ సభ ఏర్పాట్లు చేశారు. సభను విజయవంతం చేయడంకోసం జిల్లాలోని ఆయా నియోజకవర్గాలతో పాటు జంటనగరాలకు చెందిన దాదాపు ముఫ్పైవేల మందిని తరలించడానికి ఏర్పాట్లు చేశామని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి బుక్క వేణుగోపాల్ తెలిపారు.

బస్టాండ్‌లో బహిరంగ సభ శంషాబాద్ బస్‌స్టాండ్‌లో హనుమాన్ దేవాలయం ఎదుట సభను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అక్కడ గుంతలను పూడ్చివేసి స్టేజీని ఏర్పాట్లను పరిశీలించారు. శంషాబాద్ విమానాశ్రయం నుంచి భారీ ర్యాలీతో నగరానికి బయలుదేరాడానికి ఏర్పాట్లు చేశారు.