March 11, 2013

టీడీపీలో చేరనున్న పోతుల విశ్వం?

తుని: జిల్లాలో రాజకీయ సమీకరణాలు కొత్తరూపు సంతరించుకుంటున్నాయి. మరికొద్ది రోజుల్లో వస్తున్నా... మీ కోసం పాదయాత్ర ద్వారా చంద్రబాబు జిల్లాకు రానున్న సందర్భంగా ఆ పార్టీ భారీ వ్యూహ రచనకు దిగింది. ఆయన యాత్రలో భారీ ఎత్తున కొత్త నేతలను సమీకరించి పార్టీ తీర్థం ఇచ్చేందుకు రంగం సిద్ధం చేస్తోంది. పోతుల విశ్వం ఆదివారం తుని వచ్చి యనమల రామకృష్ణుడిని రహస్యం కలవడంతో ఇందుకు అద్దం పడుతోంది. ఆయన ఆరేళ్ల క్రితం ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీగా పోటీచేసి స్వల్ప తేడాతో ఓటమిపాలయ్యారు. కొంత కాలంగా ప్రజారాజ్యం పార్టీలో కొనసాగిన ఆయన పిఠాపురం, కాకినాడ రూరల్‌కు ఎమ్మెల్యే టిక్కెట్ ఆశించి భంగపడడంతో పార్టీ నుంచి వైదొలిగారు.

ఆయనకు పలు విద్యా సంస్థలు ఉన్నాయి. యనమలకు శుభాకాంక్షలు తెలిపేందుకు తన అనుచరగణంతో వచ్చిన ఆయన సుమారు గంట కాలంపాటు ఏకాంత చర్చలు జరపడం చర్చనీయాంశమైంది. త్వరలో చంద్రబాబు పాదయాత్రలో విశ్వం పార్టీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు సమాచారం. పార్టీ కూడా అందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. బలమైన సామాజిక వర్గానికి చెందిన నేతగా విశ్వం కాకినాడ పార్లమెంటు స్థానం నుంచి లోక్‌సభకు తెలుగుదేశం పార్టీ తరపున పోటీ చేయాలని భావిస్తున్నట్టు కొందరు ముఖ్య నేతలు చెబుతున్నారు. పార్టీ కూడా భరోసా ఇచ్చినందునే ఆయన యనమలను కలిశారంటున్నారు

ముందుగా కాకినాడ లోక్ సభా స్థానానికి పార్టీ ఇన్‌చార్జిగా చంద్రబాబే ప్రకటిస్తారని తెలుస్తోంది. విశ్వంతో పాటు మరికొందరు ఇతర పార్టీ నేతలు చంద్రబాబు యాత్రలో పార్టీలో చేరేందుకు మంతనాలు సాగిస్తున్నట్లు సమాచారం. మరికొద్ది రోజుల్లో ఇటువంటి నేతలు ఎవరనేది బయపడే అవకాశముంది.