March 11, 2013

కాంగ్రెస్‌తో కాళ్లబేరం ఇదేనా కడప పౌరుషం?

జగన్‌ను బయటకు తెచ్చుకునేందుకే 'ఆఫర్'
వైసీపీ.. కాంగ్రెస్ బినామీ: పయ్యావుల
వైఎస్ మృతి కుట్ర గాలికిపోయిందా: ఎర్రబెల్లి

హైదరాబాద్ : 'కడప పౌరుషానికీ, ఢిల్లీ అహంకారానికీ మధ్య పోటీ' అని ప్రగల్బాలు పలికిన జగన్ ఇప్పుడు వాటిని గాలికి వదిలేశారని టీడీపీ ధ్వజమెత్తింది. కాంగ్రెస్ కాళ్ల ముందు సాగిలపడుతున్నారని ఎద్దేవా చేసింది. కాంగ్రెస్ పార్టీతో పొత్తుకు సిద్ధమని వైసీపీ గౌరవాధ్యక్షురాలు విజయలక్ష్మి చేసిన బహిరంగ ప్రకటనే దీనికి నిదర్శమని తెలిపింది. 'తమ పార్టీని హోల్‌సేల్‌గా, రిటైల్‌గా అమ్ముకోవడానికి వైఎస్ కుటుంబం బేరాలు మొదలు పెట్టింది' అని టీడీపీ ప్రధాన కార్యదర్శి పయ్యావుల కేశవ్ ఆరోపించారు.

సోమవారం ఆయన ఎన్టీఆర్ భవన్‌లో విలేకరులతో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ మాటమాత్రమైనా అడగకుండానే మద్దతు ఇస్తామంటూ వెంట పడే పరిస్థితికి వైసీపీ దిగజారిందని అన్నారు. "ఇంకా ఎందుకు మీ దిక్కుమాలిన పాదయాత్రలు? ఎవరిని మోసం చేయడానికి? ఎన్నికల ముందు ప్రజలను మోసం చేసి, ఆ తర్వాత మీ చీకటి ఒప్పందాలతో కలిసిపోతారా? జగన్ ఆర్థిక నేరాల కేసుల్లో పీకలదాకా కూరుకుపోవడంతో ఆ పార్టీ నేతలకు భయం పట్టుకొంది. కాంగ్రెస్‌ను మంచి చేసుకొని బయటకు రావడానికే ఈ ఆఫర్లు ప్రకటిస్తున్నారు. పోయిన అసెంబ్లీ ఎన్నికల ముందు పీఆర్పీ కూడా ఇలాగే చేసింది.

ఇవన్నీ కాంగ్రెస్‌కు బినామీ పార్టీలు'' అని పయ్యావుల మండిపడ్డారు. కర్ణాటకలో గాలి జనార్దన్ రెడ్డి పార్టీకి పట్టణ ప్రాంత స్థానిక సంస్థల ఎన్నికల్లో డిపాజిట్లు దక్కలేదని, ఇక్కడ జగన్ పార్టీకి కూడా అదే గతి పట్టబోతోందని జోస్యం చెప్పారు. " స్థానిక సంస్థల ఎన్నికల్లో జగన్ పార్టీకి సహకార ఎన్నికల ఫలితాలు ఎదురుకావడం ఖాయం. ఆ ఎన్నికలు రాకూడదనే అవిశ్వాసం పెడతామని హడావుడి చేస్తోంది'' అని కేశవ్ పేర్కొన్నారు. ఢిల్లీలో కాంగ్రెస్ పెద్దలకు మాత్రమే అర్థం కావాలన్న కోరికతో, వారు చదివే ఆంగ్ల పత్రికలకు జగన్ పార్టీ నేతలు ఇంటర్వ్యూలు ఇ స్తున్నారని అన్నా రు. కాగా, వైసీపీ కూడా పీఆర్పీ బాటలోనే ఉందని తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి పెళ్లకూరులో విమర్శించారు. వైఎస్ విజయలక్ష్మి రాష్ట్రపతిని కలిసి మాట్లాడినప్పుడే ఇరు పార్టీల విలీనం ప్రస్తావన జరిగినట్లు తెలుస్తోందన్నారు.

అవన్నీ బెయిల్ పాట్లు: ఎర్రబెల్లి ఎద్దేవా
'వైఎస్ రాజశేఖరరెడ్డి మరణం వెనుక కాంగ్రెస్ పెద్దల కుట్ర ఉందని ఉప ఎన్నికల ప్రచారంలో విజయలక్ష్మి ఊరూరా చెప్పారు. ఇప్పుడు అదే కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామంటున్నారు. వైఎస్ మరణం కుట్ర గాలికి పోయిందా' అని టీడీపీ నేత ఎర్రబెల్లి దయాకరరావు ప్రశ్నించారు. జగన్‌కు బెయిలు కోసం ఆయన పార్టీ పడరాని పాట్లు పడుతోందన్నారు. "వైసీపీ మద్దతు కోసం కాంగ్రెస్ పార్టీ కూడా సీబీఐకి సహకరించకుండా తెర వెనుక ప్రయత్నాలు చేస్తోంది. వైసీపీ అసలు గుట్టు ఇప్పుడు బయట పడింది. ఎప్పటికైనా పిల్ల కాంగ్రెస్ తల్లి కాంగ్రెస్‌లో కలవడం ఖాయం' అని ఆయన అన్నారు.

'నాడు షర్మిల అవిశ్వాస తీర్మానం అన్నారు. నేడు... వైఎస్ విజయలక్ష్మి 2014 ఎన్నికల తర్వాత కాంగ్రెస్‌తో పొత్తు అంటున్నారు. రేపు... జగన్ వచ్చి కాంగ్రెస్‌లో విలీనం అంటారా?' - ట్విట్టర్‌లో నారా లోకేశ్