March 26, 2013

టీడీపీకి ఫూర్వ వైభవం తేవాలి

బైరెడ్డిపల్లె,: రాష్ట్రంలో టీడీపీ పార్టీకి మళ్ళీ పూర్వవైభవం తీసుకురావడానికి నాయకులు, కార్యకర్తలు శాయశక్తులా కృషి చేయాలని మాజీ మంత్రి పట్నం సుబ్బయ్య పిలుపునిచ్చారు. బైరెడ్డిపల్లె మండలంలో గత రెండు రోజులుగా జరుగుతున్న టీడీపీ సంస్థాగత ఎన్నికల్లో భాగంగా సోమవారం దేవదొడ్డిలో జరిగిన సమావేశంలో ఆయన ప్రసంగించారు.

ఒక వైపు విద్యుత్ సమస్యతో రైతులు, పెరిగిన ధరలతో సామన్య ప్రజలు తల్లడిల్లుతున్నా కాంగ్రెస్ ప్రభుత్వం ఉలుకుపలుకు లేకుండా వుంటోందని విమర్శించారు. రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా వుండాలంటే టీడీపీ పాలనలోనే సాధ్యమవుతుందన్నారు. కాగా గగినేపల్లె, దేవదొడ్డి, తీర్థం, గడ్డూరు, ఎం.కొత్తూరు, దాసార్లపల్లె మూగనపల్లె, గొల్లచీమనపల్లె, లక్కనపల్లె, పెద్దచెల్లారగుంటలో గ్రామ కమిటీ ఎన్నికలు ఏకగ్రీవంగా జరిగాయి.

ఈ కార్యక్రమంలో టీడీపీ అధ్యక్షుడు, మాజీ ఎంపీపీ శ్రీనివాసులు రెడ్డి, నాయకులు సుభాష్ చంద్రబోస్, రామచంద్ర నాయుడు, రాజన్న, అమరనాధరెడ్డి, వెంకట్రమణగౌడు, వెంకటప్పగౌడు తదితరులు పాల్గొన్నారు.