March 20, 2013

బాలకృష్ణ పర్యటనకు తరలిరావాలి: దాడి రత్నాకర్


పాయకరావుపేట: ఈ నెల 23న సినీ నటుడు నందమూరి బాలకృష్ణ 'పేట' పర్యటనను విజయవంతం చేయాలని టీడీపీ రూరల్ జిల్లా అధ్యక్షుడు దాడి రత్నాకర్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. లక్ష్మి ఫంక్షన్ హాల్లో మంగళవారం నిర్వహించిన పార్టీ విస్తత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్టీఆర్ విగ్రహాల ఆవిష్కరణలో బాలకృష్ణ పాల్గొంటున్నారని అధిక సంఖ్యలో కార్యకర్తలు, నాయకులు హాజరై ఆయనకు స్వాగతం పలకాలన్నారు. 23న మధ్యాహ్నం మూడు గంటలకు పాల్తేరు పంచాయతీ అంకంపేటలో ఎన్టీఆర్ విగ్రహాన్ని బాలకృష్ణ ఆవిష్కరిస్తారన్నారు. కందిపూడి, రాజగోపాలపురం, కుమారపురంలలో కూడా ఎన్టీఆర్ విగ్రహాలను ఆవిష్కరిస్తారన్నారు. అనంతరం కుమారపురంలో భారీ బహిరంగ సభలో బాలకృష్ణ ప్రసంగిస్తారని దాడి రత్నాకర్ తెలిపారు.

నియోజకవర్గంలో పార్టీ పేరుతో పదవులు అధిరోహించిన నాయకుడొకరు పార్టీనే విమర్శించడం సిగ్గుచేటన్నారు. ఏప్రిల్ 3న నాతవరం మండలం గన్నవరం మెట్ట వద్ద విశాఖ జిల్లాలోకి ప్రవేశించనున్న చంద్రబాబు 'వస్తున్నా మీ కోసం' పాదయాత్రకు నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో హాజరై స్వాగతం పలకాలని 'దాడి' పిలుపునిచ్చారు. టీడీపీ మండల పార్టీ అధ్యక్షుడు కంకిపాటి వెంకటేశ్వరరావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు విజయకుమార్, పార్టీ నాయకులు కురందాసు నూకరాజు, బొల్లం బాబ్జి, లాలం కాశీనాయుడు, వేజెర్ల వినోద్‌రాజు, గొర్రెల రాజబాబు, పెదిరెడ్డి చిట్టిబాబు, మజ్జూరి నారాయణరావు, చింతకాయల రాంబాబు, దేవవరపు శివ, పెదిరెడ్డి శ్రీను, కంచి మాణిక్యం, వంకా రమణ, నీలాపు మహేష్‌రెడ్డి, మల్లవరపు వీరభద్రరావు, భజంత్రీల శివ, దేవవరపు వెంకట్రావు, గోసల తాతారావు, నాగం బుల్లిదొర, లెక్కల గోవిందు, జి.శాంతమ్మ, గీసాల పద్మ, కీర్తి నాగేశ్వరరావు పాల్గొన్నారు.