April 16, 2013

'ప్రజా సమస్యలను విస్మరిస్తున్న కాంగ్రెస్'

నిర్మల్: ప్రజా సమస్యలను విస్మరిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి త్వరలో నూకలు చెల్లే కాలం వస్తుందని ఎంపీ రాథోడ్ రమేష్ అన్నారు. సోమవారం టీడీపీ ఆధ్వర్యంలో జెండా పండుగ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలోని రూరల్ పోలీస్ స్టేషన్ సమీపంలోని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం బైక్‌ర్యాలీ నిర్వహించి బస్టాండ్ సమీపంలో పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.

రాష్ట్రంలో విద్యుత్ కోతలు విపరీతంగా పెరిగిపోయాయని, దీనికితోడు విద్యు త్ చార్జీలు పెరగడంతో సామాన్య ప్రజలు దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నారన్నారు. రైతు సంక్షేమం పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను రోడ్డుకీడ్చిందన్నారు. జిల్లాలోని వివిధ ఉద్యోగాల ఖాళీలను ప్రభుత్వం ఇంత వరకు భర్తీ చేయకపోవడం దారుణమన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు గండ్రత్ రమేష్, జిల్లా ప్రధాన కార్యదర్శి లోలం శ్యామ్‌సుందర్, రాష్ట్ర రైతు కార్యదర్శి కొరిపెల్లి భూషణ్‌రెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి ఆకోజి కిషన్, నాయకులు పూదరి రాజేశ్వర్, పూదరి నరహరి, నాయకులు ముజ్గి భాస్కర్, చెనిగారపు చిన్నయ్య, తునికి నారాయణ తదితరులు పాల్గొన్నారు.