March 24, 2013

కోత, మోతపై టీడీపీ ఆగ్రహం

విద్యుత్ సౌధ ముట్టడి.. లాంతర్లతో నిరసన

హైదరాబాద్: విద్యుత్ కోతలకు తోడు సర్‌చార్జీల పేరుతో సామాన్య ప్రజలను దోచుకుతింటున్నారని తెలుగుదేశం పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. శనివారం హైదరాబాద్‌లోని విద్యుత్ సౌధ వద్ద లాంతర్లతో భారీ ఎత్తున నిరసన ప్రదర్శన నిర్వహించింది. పార్టీ నగర శాఖ అధ్యక్షుడు తలసాని శ్రీనివాసయాదవ్ ఆధ్వర్యంలో భారీ సంఖ్యలో పార్టీ నాయకులు, కార్యకర్తలు సోమాజిగూడలోని విద్యుత్ సౌధను ముట్టడించారు. లాంతర్లను చేతబట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. నిరసనతో భారీగా ట్రాఫిక్ నిలిచిపోవడంతో.. పోలీసులు పార్టీ నాయకులను, కార్యకర్తలను అరెస్ట్ చేసి, పోలీస్ స్టేషన్‌కు తరలించారు.