March 24, 2013

చంద్రన్నా! నీవే దిక్కు!

వైఎస్ హయాంలో జరిగిన అక్రమాలు, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో జరుగుతున్న అన్యాయాలపై ధర్మ పోరాటానికి టీడీపీ కార్యకర్తలంతా కలసిరావాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. 'వస్తున్నా మీ కోసం' యాత్రలో భాగంగా శనివారం ఆయన కడియం, వీరవరంలలో మాట్లాడారు. అక్రమాలు జరుగుతున్నా మనకెందుకులే.. అని నిర్లక్ష్యం, నిర్లిప్తత కార్యకర్తలకు రాకూడదన్నారు. ప్రజల్లోకి వెళ్లి వైఎస్, జగన్, కాంగ్రెస్ అక్రమాలు, లక్షల కోట్లు దోచుకున్న వైనాలపై అవగాహన కల్పించాలన్నారు. వైఎస్ అవినీతికి భావితరాలు కూడా మూల్యం చెల్లించుకోవాల్సిన దుస్థితి నెలకొందన్నారు. పోలవరం వంటి పలు ప్రాజెక్టుల్లో వేల కోట్లు దోచుకున్నారన్నారు. కాంగ్రెస్ అవినీతి వల్ల రాష్ట్రం అధోగతి పాలయిందని, ధరల పెరుగుదల, విద్యుత్ సర్‌ఛార్జీలు, పేదరికం వంటివన్నీ వైఎస్, కాంగ్రెస్ పాపాలేనని బాబు విమర్శించారు.

పప్పుబెల్లాలు ప్రజలకు.. లక్ష కోట్లు కొడుక్కి వైఎస్ హయాంలో ప్రజలకు పప్పుబెల్లాలు పంచి.. కొడుకు జగన్‌కి మాత్రం లక్ష కోట్లు దోచిపెట్టారన్నారు. ఆ సొమ్ము పేదలకు పంచితే రాష్ట్రంలో పేదరికం ఉండదన్నారు. ప్రజల సొమ్ము దోచుకున్న జగన్ జైలులో గడుపుతున్నాడని, అక్రమాలకు పాల్పడిన వారికి ఇదే గతిపడుతుందన్నారు. వైఎస్ ఆత్మ కేవీపీ సీబీఐ విచారణలో వెల్లడి చేసే విషయాలతో మరిన్ని అక్రమాలు బయటపడతాయని చంద్రబాబు తెలిపారు.