March 22, 2013

చంద్రబాబు పాదయాత్రను విజయవంతం చేయాలి

నాతవరం: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు ఏప్రిల్ 4వ తేదీన నర్సీపట్నం నియోజకవర్గంలో 'వస్తున్నా మీకోసం' పాదయాత్ర చేయనున్నారని, నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు చింతకాయల అయ్యన్నపాత్రుడు కోరారు. గురువారం ఆయన నాతవరం మండల నాయకులతో కలిసి చెర్లోపాలెం, డి.ఎర్రవరం, జిల్లేడపూడి గ్రామాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా విలేఖర్లతో మాట్లాడుతూ, చంద్రబాబునాయుడు తూర్పుగోదావరి జిల్లాలో పాత్రయాత్ర ముగించుకొని ఏప్రిల్ నాలుగో తేదీన నాతవరం మండలం గన్నవరం వద్ద విశాఖ జిల్లాలో ప్రవేశిస్తారని చెప్పారు. అక్కడ భారీ ఎత్తున స్వాగతం పలుకుతామని, తరువాత ఎ.శరభవరం, శృంగవరం, గాంధీనగరం, తాండవ జంక్షన్ మీదుగా డి.ఎర్రవరం చేరుకుని మదర్ కాలేజీలో రాత్రి బస చేస్తారని చెప్పారు.

తొలిరోజు చంద్రబాబు 14 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేస్తారని అయ్యన్నపాత్రుడు తెలిపారు. ఏప్రిల్ ఐదో తేదీన డి.ఎర్రవరంలో జిల్లా నాయకులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహిస్తారన్నారు. అనంతరం చెర్లోపాలెం నుంచి కోటవురట్ల మండలం కొత్తూరు మీదుగా పాములవాక వరకు పాదయాత్ర చేస్తారని, రాత్రికి పాములవాకలో బస చేస్తారని వివరించారు. ఆరో తేదీన నీలిగుంట, కొత్తపల్లి గ్రామాల్లో పాదయాత్ర చేసి జల్లూరులో బసచేస్తారని, ఏడో తేదీన మాకవరపాలెం మండలం గిడుతూరు, మల్లవరం గ్రామాల్లో పాదయాత్ర చేసి రాత్రికి మాకవరపాలెంలో బస చేస్తారన్నారు.

మరుసటి రోజు అక్కడి నుంచి కన్నూరుపాలెం మీదుగా అనకాపల్లి నియోజకవర్గంలోకి ప్రవేశిస్తారని అయ్యన్న తెలిపారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేసి చంద్రబాబు పాదయాత్రను జయప్రదం చేయాలని అయ్యన్నపాత్రుడు కోరారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు లాలం అబ్బారావు, పార్టీ నాయకులు కొండబాబు, ఎన్.విజయ్‌కుమార్, అప్పిరెడ్డి మాణిక్యం, రుత్తల శేషుకుమార్, పినిరెడ్డి జోగారావు, ఇ.దివాణం, లాలం వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు.