February 13, 2013

ఇలాంటి రాజ్యలక్ష్మిలే రాష్ట్రమంతా!

అదేమీ మారుమూల గ్రామం కాదు. గుంటూరు పట్టణానికి పది కిలోమీటర్ల దూరంలోనే ఉంది. కృష్ణానదికి కూడా ఇంచుమించు అంతే దూరం. కానీ, ఎక్కడా ఆ ఛాయలు కనిపించవు. ఎక్కడా ఆ వెలుగులు చూడలేం. మంచి ఎండలో ఉప్పలపాడులోకి అడుగుపెట్టినప్పుడు.. నాకు కాసిని నీళ్లు ఇవ్వడానికీ ఊరి జనం జంకారు. అర్థం కాలేదు. దాహం కూడా తీర్చలేని గ్రామామా ఇది..అనిపించింది. అయితే, వాళ్లు చెప్పింది విన్నాక ఆ దాహం విషయమే మరిచిపోయాను. ఆ ఊరంతా ఉప్పునీరేనట. పశువులు కూడా ఆ నీళ్లు ముట్టడం లేదట. కొన్ని గొంతులో పోసుకున్నా. నాలుక పీక్కుపోతున్నట్టనిపించి ఊసేశాను.

అసలు వీళ్లెలా బతుకుతున్నారు? ఉప్పు ఉరిపెట్టిన ఈ ఊరికి ఊపిరి పోవడమెలా? ఊళ్లో మరే సమస్యా లేదు. ఎవరిని కదిలించినా నీళ్లూకన్నీళ్లే! ఆ ఊరు దాటి ముందుకు సాగుతుంటే ఒక లారీ డ్రైవర్ కలిశాడు. 'సార్.. మీతో మాట్లాడాలి' అని కోరడంతో ఆగి ఆరా తీశాను. "పేరుకి లారీ ఓనర్‌ని. క్లీనర్ కన్నా దుర్భరంగా ఉంది జీవితం. డీజిల్ ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. బాడుగ గిట్టుబాటు కావడం లేదు. అరకొర సంపాదనంతా నా వైద్యానికే పోతోంది. ఇంత చేస్తున్నా..మంచం పట్టడం తప్ప బతుకులో మార్పేమీ లేదు'' అని వాపోయాడు.

హైదరాబాద్‌లో స్టీరింగ్ మారకుండా ఈ డ్రైవర్ల లారీ గాడిన పడేనా!
హాఫ్‌పేటలో ఆ మహిళ తలపోత నన్ను కదిలించింది. పేరు రాజ్యలక్ష్మి అట. "కరెంట్ బిల్లులు కట్టలేకపోతున్నాం. ఇదేం ప్రభుత్వమ''ని ఆక్రోశిస్తుంటే.. 'కారణం ఎవరో తెలుసా?' అని ప్రశ్నించాను. తెలియదని అమాయకంగా ముఖం పెట్టింది. తొమ్మిదేళ్ల కాంగ్రెస్ పాపాలే ఈ శాపాలని చెబితే.. 'అవును కదా' అని రాజ్యలక్ష్మి తలూపింది. 'చార్జీలు పెరిగాయనుకుంటున్నామేగానీ, ఎందుకు..ఏమిటీ..ఎలా అనేది ఆలోచించలేదు సార్..' అని ఒప్పేసుకుంది. ఇలాంటి రాజ్యలక్ష్మిలే కదా రాష్ట్రమంతటా!