February 13, 2013

దున్నపోతుకి గడ్డేసి పాల కోసం చూస్తారా?

పెడితే తిని పడుకుంటుందంతే
ఇంకా మాట్లాడితే రంకెలేస్తుంది
మీరు మేల్కొంటేనే మంచి రోజులు..
గుంటూరు జిల్లా పాదయాత్రలో చంద్రబాబు

దున్నపోతుకు గడ్డివేస్తే తిని పడుకుంటుందని, పాలివ్వకపోగా రంకెలేస్తుందని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు అన్నారు. అదే ఆవుకు గడ్డి వేస్తే సాధుజంతువులా పాలు ఇస్తుందని పేర్కొన్నారు. దున్నపోతులాంటి కాంగ్రెస్ పార్టీ కావాలో.. సాధుజంతువులాంటి ఆవును కోరుకుంటారో తేల్చుకోవాలని గుంటూరు జిల్లా పాదయాత్రలో ప్రజలను ఆయన కోరారు. బుధవారం పొన్నూరు నియోజకవర్గం ఉప్పలపాడు నుంచి ఆయన పాదయాత్ర ప్రారంభించారు. వెంకట క్రిష్టాపురం, ఆఫ్‌పేట మీదుగా 11.4 కిలోమీటర్లు నడిచి కాజీపేటలో రాత్రి బస చేశారు. అంతకుముందు.. యాత్రలోభాగంగా కలిసిన ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. కాంగ్రెస్, వైసీపీ దోపిడీపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. డబ్బు పోవడమే గానీ ప్రాజెక్టులు పూర్తికావడం లేదని రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శించారు.

"పోలవరం కట్టకుండా రూ. 10 వేల కోట్లు వృధాగా ఖర్చుపెట్టారు. పులిచింతల ప్రాజెక్టు తొమ్మిదేళ్లయినా పూర్తికాలేదు. మేమైతే రెండేళ్లలోనే పూర్తి చేసేవాళ్లం. మేమొస్తే పూర్తి చేసి తీరతాం'' అని పేర్కొన్నారు. సీఎం కిరణ్‌కు నీటి యాజమాన్యం అంటే ఏమిటో కూడా తెలియదని దుయ్యబట్టారు. " ఈయనకు (కిరణ్) దూరదృష్టే లేదు. నాగార్జున సాగర్‌లో 495 అడుగులు నీటి మట్టం ఉన్నప్పుడూ మేము పంటలకు నీరిచ్చాం. ఇప్పుడు 517 అడుగులున్నా ఇవ్వడం లేదు'' అని విమర్శించారు, సాగునీటి సంఘాల ఎన్నికల పేరిట విడుదల చేసిన 500కోట్లు కాంగ్రెస్ దొంగల జేబుల్లోకి పోతాయని ఆరోపించారు. ఈ విషయాలపై ప్రజలు మేల్కొని నేతలను అదుపులో పెట్టాలని కోరారు.

"మాదేం పోయింది. ఎవరి డబ్బో తింటున్నారనుకుంటే పోయేదంతా మీదే. మీ ఎంగిలి మెతుకులే వారు తింటున్నారు''అని చెప్పారు. తన పాదయాత్రపై వస్తున్న విమర్శలకు దీటుగా స్పందించారు. తమ వల్లనే తొలినుంచి రైతు రుణాల మాఫీ అంశం చర్చకు వస్తున్నదని గుర్తుచేశారు. "దేశంలో ఇప్పటివరకు రెండు సార్లు రుణమాఫీ అమలు జరిగింది. టీడీపీ వత్తిడితో నాడు దేవీలాల్ అమలు చేశారు. 2009కు ముందు మా పార్టీ రుణమాఫీపై హామీ ఇవ్వగా, వైఎస్ అడ్డుపడ్డారు. కానీ, కేంద్రం అమలు చేసింద''ని వివరించారు.

సహకార సొసైటీ ఎన్నికల ఫలితాలు చూస్తే, అసెంబ్లీలోకి సైకిల్ దూసుకు వెళ్లడం ఖాయమనిపిస్తోందని చంద్రబాబు జోస్యం చెప్పారు. వ్యవసాయం దండగ అని ఏనాడూ తాను అనలేదని చెప్పారు. "రైతుబిడ్డలు ఉన్నత చదువులు అభ్యసించి పైకి రావాలని నేను అంటే వ్యవసాయం దండగ అని అన్నానని వైఎస్ ద్రుష్పచారం చేశారు. అది మీరు కూడా నమ్మి ఓట్లేశారు.'' అని పేర్కొన్నారు. టీడీపీ వస్తే పేద వాడి ఆరోగ్యం కోసం సమగ్ర బీమా పథకం తీసుకొచ్చి డెంగ్యూ, చికున్‌గున్యా, మలేరియా సహా అన్ని వ్యాధులకు చికిత్స చేయిస్తా''నన్నారు.

సమైక్యాంధ్ర అనండి సార్..
ఉప్పలపాడులో బాబు మాట్లాడుతుండగా ఓ రై తు ముందుకొచ్చాడు. రాష్ట్రం కలిసిమెలిసి ఉండాలన్న ఆకాంక్షను వెలిబుచ్చారు. అంతటితో ఆగకుండా 'సార్.. సమైక్యాంధ్రపై ప్రకటన చేయండి' అని అడిగాడు. పార్టీ వైఖరిని ఇప్పటికే తెలియజేశామని చంద్రబాబు గుర్తుచేశారు. "పార్టీ వైఖరిని పలుమార్లు స్పష్టం చేశాం. దానిపై నిర్ణయం కేంద్రం చేయాల్సి ఉంది'' అని వివరించారు.