February 13, 2013

సామాజిక న్యాయం.. టీడీపీ ధ్యేయం

సామాజిక న్యాయమే తెలుగు దేశం పార్టీ ధ్యేయమని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. 'వస్తున్నా మీ కోసం' పాదయాత్ర ఆరో రోజైన మంగళవారం గుంటూరు నగరంలో ఆరంభం నుంచి ఉత్సాహంగా కొనసాగింది. సాయంత్రం బస్టాండ్ సమీపంలోని ఎన్టీఆర్ విగ్రహం కూడలి వద్ద భారీగా వచ్చిన ప్రజలనుద్దేశించి మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ అవినీతి కారణంగా ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. అగ్రవర్ణాల్లోని పేదలకు రిజర్వేషన్లు వర్తింపజేస్తానని హామీ ఇచ్చారు.

రవాణా రంగంలోని ్రడైవర్లకు ప్రభుత్వమే రూ. 5 లక్షల ప్రమాద బీమా సౌకర్యం కల్పించేలా చూస్తానన్నారు. ఆటో ్రడైవర్లను, ఓనర్ కం ్రడైవర్లగా మారుస్తానని ఇందుకు రూ. లక్ష వరకు రుణం ఇప్పించేలా చూస్తానన్నారు. ఎలాంటి విద్యార్హతతో సంబంధం లేకుండా పరీక్షలు నిర్వహించి లైసెన్స్‌లు మంజూరు చేయిస్తానన్నారు.

నగరాల్లో పార్కింగ్ ప్రదేశాలు ఏర్పాటు చేసి జరిమానాలు కట్టే పని లేకుండా చూస్తానన్నారు. ప్రజలకు మైకు అందించి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. వారు చెప్పిన సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ప్రజల నుంచి అనూహ్య స్పందన వస్తుండటంతో సుమారు గంటకు పైగా మాట్లాడారు. ఏపీఎస్ ఆర్టీసీకి పూర్వ వైభవం తీసుకువస్తానని, ఇందులోని ఉద్యోగుల కోసం ప్రత్యేక పాలసీ రూపొందిస్తానన్నారు. స్థానికులకు స్థానికంగా ఉద్యోగాలు కల్పించేందుకు విజయవాడ, గుంటూరులను ట్విన్ సిటీస్‌గా అభివృద్ధి చేస్తానన్నారు. వ్యవసాయ ఆధారిత పరిశ్రమల స్థాపనతో పాటు ఐటీ రంగాన్ని ఇక్కడ ప్రోత్సహిస్తానన్నారు. ఔటర్ రింగ్ రోడ్డులు ఏర్పాటు చేసి రహదారులను అభివృద్ధి చేస్తానన్నారు. సాగర్ జలాల సమస్యను పరిష్కరించి కృష్ణా, గుంటూరు జిల్లాలకు సక్రమంగా సాగర్ జలాలు అందేలా చర్యలు తీసుకుంటానన్నారు. తాను అధికారంలోకి వచ్చిన వెంటనే రైతుల కోసం తొలి సంతకం రుణమాఫీపై పెడతానని, మహిళల కోసం బెల్టు షాపులు రద్దు చేయిస్తానన్నారు. అదే విధంగా అవినీతిపై పోరాటానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. అందివస్తున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని కాంగ్రెస్ ప్రభుత్వ అవినీతిని ఎండగట్టాలన్నారు. నేడు కొంత మంది సూట్ కేసుల మోజులో పార్టీలు మారుతున్నారని, అలాంటి వారికి తగిన గుణపాఠం చెప్పాలన్నారు. సామాజిక న్యాయం పేరుతో ఏర్పడిన ప్రజా రాజ్యం పార్టీ తర్వాత కాంగ్రెస్‌లో విలీనం అయిన విషయాన్ని గుర్తు చేస్తూ, జైలు పార్టీ కొన్ని స్థానాల్లో గెలిచినా, కేసులు మాఫీ కోసం తిరిగి కాంగ్రెస్‌లో కలుస్తుందని జోస్యం చెప్పారు. రానున్న ఎన్నికల్లో తెలుగు దేశం పార్టీని గెలిపిస్తే ఉజ్వల భవిష్యత్ అందిస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తెలుగు దేశం పార్టీ నాయకులు కోడెల శివప్రసాదరావు, ప్రత్తిపాటి పుల్లారావు, కడియం శ్రీహరి, పెద్దిరెడ్డి, లాల్‌జాన్ భాషా, దూళిపాళ్ల నరేంద్ర, జీవీవీ ఆంజనేయులు, నక్కా ఆనందబాబు, నన్నపనేని రాజకుమారి, కవిత, జియావుద్దీన్, సుద్దాల దేవయ్య, విజయ రమణారావు, స్థానిక నాయకులు కొంపల్లి మాల కొండయ్య, బొల్లా నాగేశ్వరావుపాల్గొన్నారు.