May 28, 2013

తొమ్మిదోసారి టిడిపి పగ్గాలు చేపట్టిన చంద్రబాబు !

తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడిగా నారా చంద్రబాబు నాయుడు వరుసగా తొమ్మిదోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. తెలుగు దేశం పగ్గాలు చేపట్టి ఈ సారి ఎన్నికల్లో విజయం తమదేనని ధీమా వ్యక్తం చేసారు. హైదరాబాద్ నగర శివారులో నిర్వహిస్తున్న మహానాడు క్రయక్రమం రెండో రోజు జోరుగా సాగింది.

మంగళవారం స్థానిక సంస్థలపై మహానాడులో ప్రతిపాదించిన తీర్మానంపై ఆయన ప్రసంగించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరాలని ఆయన వ్యాఖ్యానించారు. తమది నిజాయితీ గల పార్టీ అని, ప్రజలు తమ వెంటే ఉన్నారని ఆయన అన్నారు. దోపిడీ దొంగల పక్కన ఎన్టీఆర్ ఫొటో పెట్టడం బాధగా ఉందని ఆయన వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకుల తీరుపై అసహనం వ్యక్తం చేసారు.

అయితే వస్తున్నా.. మీకోసం పాదయాత్రలో మిగిలి పోయిన జిల్లాలను బస్సు యాత్ర ద్వారా పూర్తి చేసేందుకు సిద్ధం అయ్యారు. ఈ మేరకు రెండో రోజైన మంగళవారం మహానాడులో ఆయన ప్రకటించారు. టీడీపీ నేతలు, కార్యకర్తలు ఈసారి బస్సు యాత్ర చేయాలని కోరుతున్నారని ఆయన తెలిపారు. మరోవైపు జూన్‌లో పార్టీ కార్యకర్తలకు హైదరాబాదులో శిక్షణా తరగతులు నిర్వహించనున్నట్లు చంద్రబాబు వెల్లడించారు