April 11, 2013

విద్యుత్ చార్జీలను తగ్గించాలంటూ గవర్నర్‌కు వినతి

రాజంపేట రూరల్: ప్రభుత్వం పెంచిన విద్యుత్తు చార్జీలను తగ్గించాలని గవర్నర్ నరసింహన్‌కు మండల పరిధిలోని శేషమాంబాపురం గ్రామస్థులు వినతిపత్రం పంపారు. బుధవారం తెలుగదేశం పార్టీ మండల ప్రధాన కార్యదర్శి పసుపులేటి చంద్రశేఖర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఆ గ్రామ ప్రజల నుంచి సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెంచిన విద్యుత్తు చార్జీల వల్ల సామాన్య ప్రజలపై ఆర్థికంగా భారం పెరుగుతుందని వాపోయారు. ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని పెంచిన విద్యుత్తు చార్జీలను తగ్గించాలని గవర్నర్‌కు పంపిన వినతిపత్రంలో కోరామన్నారు. కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షులు పి.జనార్థనయ్య, కార్యదర్శులువిశ్వనాథరాజు, పి.రుషికేశవయ్య తదితరులు పాల్గొన్నారు.