April 26, 2013

చలో శంషాబాద్

మహబూబ్‌నగర్ : టీడీపీ అధినేత చంద్రబాబు పాదయాత్ర ముగింపు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించేందుకు తమ్ముళ్లు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. గత అక్టోబరులో చంద్రబాబు జిల్లాలో నిర్వహించిన పాదయాత్రను విజయవంతం చేసిన నేపథ్యంలో, అదే స్ఫూర్తితో ముగింపు వేడుకకు తరలివెళ్లేందుకు సన్నద్ధమవుతున్నారు. పార్టీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జీలు, సీనియర్ నాయకులు గడచిన వారం రోజులుగా ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. వైజాగ్‌లో నిర్వహించనున్న ముగింపు వేడుకల్లో పాల్గొనేందుకు కొంతమంది నాయకులు ఇప్పటికే తరలివెళ్లగా, యాత్ర అనంతరం, హైదరాబాద్ (శంషాబాద్) చేరుకున్న సందర్భంగా ఘనస్వాగతం పలకడంపైనే ఎక్కువ దృష్టి సారించారు. ఇందుకోసం, జిల్లాలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి పెద్దసంఖ్యలో వాహనాలను సిద్ధంచేశారు.

వస్తున్నా మీ కోసం పేరుతో చంద్రబాబు చేపట్టిన పాదయాద్ర ఈ నెల 27న ముగియనున్న సంగతి తెలిసిందే. దీంతో, పార్టీ ఎమ్మెల్యేలు, ముఖ్యనాయకులు కొంతమంది ఇప్పటికే వైజాగ్ చేరుకోగా 28న చంద్రబాబు, హైదరాబాద్ రానున్నందున ఆయనకు ఘనస్వాగతం పలికేందుకు మరికొంత మంది నాయకులు వాహనాలు సమకూర్చడం, కార్యకర్తలను సమీకరించడంలో నిమగ్నమయ్యారు. జిల్లా నుంచి కనీసం 20 వేల మంది కార్యకర్తలు, నాయకులు శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు తరలివెళ్లేలా వాహనాలు సిద్ధం చేస్తున్నారు. రాజ
ధానికి సమీప నియోజకవర్గాలైన షాద్‌నగర్, జడ్చర్ల, కల్వకుర్తి వంటి ప్రాంతాల నుంచి ఎక్కువ సంఖ్యలో, దూరంగా ఉన్న నియోజకవర్గాల నుంచి కొంత తక్కువ సంఖ్యలో కార్యకర్తలను సమీకరించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆలంపూర్, గద్వాల వంటి నియోజకవర్గాల్లో పర్యటించి స్థానిక నాయకులతో చర్చించారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న షాద్‌నగర్ నియోజకవర్గ పరిధి నుంచి కనీసం ఆరు వేల మంది కార్యకర్తలను సమీకరించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు బక్కని నర్సింహులు తెలిపారు. అలాగే, అన్ని నియోజవకర్గాల నుంచి కూడా స్థానిక ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇంచార్జీల సహకారంతో పార్టీ అధినేతకు ఘన స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. 28న మధ్యాహ్నం ఒంటి గంటకు శంషాబాద్ చేరుకున్న తర్వాత, పార్టీ నాయకులు, కార్యకర్తలు నిర్వహించే భారీ ర్యాలీలో పాల్గొంటారన్నారు. ఈ ర్యాలీలో, ఎంఆర్‌పీఎస్ నేత మందకృష్ణ కూడా పాల్గొంటారని టీడీపీ వర్గాలు తెలిపాయి. మరో వైపు 28నే హైదరాబాద్‌లో మందకృష్ణ ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్న సంగతి తెలిసిందే.