March 25, 2013

ఏడిదలోనేతల సందడి...

మండపేట: టీడీపీ అధినేత మాజీ ముఖ్య మంత్రి నారా చంద్రబాబునాయుడు వస్తున్నా మీ కోసం పాదయాత్రలో భాగంగా శనివారం మండపేట మండలం ఏడిదకు చేరుకుంది. ఆయన పాదయాత్రకు ఆదివారం విరామం ప్రకటించటంతో ఆయన పూర్తిగా విశ్రాంతిలోనే గడిపారు. పాదయాత్ర సందర్భంగా బాబును కలిసేందుకు శనివారం ఏడిదకు వచ్చిన భువనేశ్వరి తిరిగి ఆదివారం హైదరాబాదుకు వెళ్లిపోయారు. ముఖ్యంగా ఆయన బసచేసిన ఏడిద చింతాలమ్మగుడి సమీపంలో ఏర్పాటుచేసిన శిబిరం పోలీసులతో నిండిపోయింది. బాబు విజయవాడ ముఖ్యనేతలతో సుమారు గంటన్నర పాటు సమావేశమయ్యారు.

కృష్ణా జిల్లాకు చెందిన టీడీపీ నేతలు వల్లభనేని వంశీ, కేశినేని నానీ, బుద్దా వెంకన్న, నాగుళ్ల మీరా తదితరు లు చంద్రబాబును విడివిడిగా కలుసుకున్నారు. వీరితో బాబు సుదీర్ఘంగా గంటన్నరపాటు చర్చ లు జరిపారు. ఈ చర్చల్లో విజయవాడ రాజకీయాలపై నేతలు బాబుతో చర్చించారు. ఈ చర్చల్లో పార్టీ పరిస్థితిపై సమీక్షించినట్లు తెలిసింది. బాబును కలిసిన నేతలను విలేఖర్లు ప్రశ్నించగా విజయవాడలో టీడీపీ బలంగా ఉందని వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ విజయానికి కృషిచేస్తామని, బాబు ఇచ్చిన సూచనలు సలహాలు పాటిస్తామని ఆ పార్టీ సీనియర్ నేత కేశినేని నాని చెప్పారు. పార్టీ పదవుల వ్యవహారంపై ప్రశ్నించినప్పుడుఅలాంటి అంశాలేవీ చర్చకురాలేదని తెలిపారు.

ప్రస్తుతం తా మంతా కలిసికట్టుగా పనిచేస్తున్నామని ప్రకటించారు. టీడీపీ నేత వల్లభనేని వంశీ మీడియాతో మాట్లాడేందుకు నిరాకరించారు. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకరరావు కుటుంబ సభ్యులతో చంద్రబాబును కలిశారు. బాబును కలిసిన వారిలో ముఖ్యనేతలతో పాటు కె.గంగవరం మండలంలో ఉన్న కొంతమంది కార్మికులు బాబును మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. బాబు ను కలిసిన వారిలో ముఖ్య నేతలతో పాటు స్థానిక ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు ఉన్నారు.