March 25, 2013

'తూర్పు'లో అభ్యర్థుల ఖరారు

హైదరాబాద్ : తూర్పు గోదావరి జిల్లాలోని మూడు లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను టీడీపీ ఖరారు చేసింది. రాజమండ్రి సీటును సినీ నటుడు మురళీమోహన్‌కు ఖరారు చేశారు. ఎస్సీలకు రిజర్వు చేసిన అమలాపురం సీటుకు మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావును ఎంపిక చేశారు. సూర్యారావు పేరును చంద్రబాబు ఆ జిల్లా పార్టీ సమావేశంలో అధికారికంగా ప్రకటించారు. ఇక కాకినాడ సీటుకు పోతుల విశ్వం పేరు ఖరారు చేశారు. త్వరలోనే చంద్రబాబు ఆయన పేరును ప్రకటించనున్నట్లు ఆ జిల్లా పార్టీవర్గాలు తెలిపాయి.

స్థానిక నాయకులతో మాట్లాడి వీరి పేర్లను ఆయన ఖరారు చేసినట్లు ఈ వర్గాలు తెలిపాయి. విద్యా సంస్థల అధినేత అయిన విశ్వం గతంలో ప్రజారాజ్యం పార్టీలో చురుగ్గా పనిచేసి.. ఆ తరువాత ఆ పార్టీకి దూరమయ్యారు. ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి ఒకసారి పోటీచేశారు. కాగా, తూర్పుగోదావరికి పొరుగున ఉన్న పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న రెండు ఎంపీ సీట్లలో ఒక సీటుకు (ఏలూరు- మాగంటి బాబు) అభ్యర్థిని ఖరారు చేశారు.

కృష్ణా జిల్లాలో రెండు సీట్లు ఉండగా, మచిలీపట్నం సీటుకు సిట్టింగ్ ఎంపీ కొనకళ్ల నారాయణరావును ఈసారి కూడా నిలపనున్నారు. విజయవాడ సీటుకు కేశినేని ట్రావెల్స్ అధినేత నాని పేరు ఖరారైంది. అధికారికంగా ప్రకటించకపోయినా ఆ జిల్లా పార్టీ నేతలకు చంద్రబాబు ఆయన పేరును ఇప్పటికే వెల్లడించినట్లు సమాచారం. ఈ స్థానంలో మునుపటి ఎన్నికలలో పోటీచేసిన వల్లభనేని వంశీని నూజివీడు అసెంబ్లీ నియోజక వర్గంలో నిలపాలని టీడీపీ యోచిస్తోంది.