March 25, 2013

టీడీపీ హయాం భేష్: నాగం

హైదరాబాద్: తన పాలనలో టీడీపీ విద్యుత్‌రంగాన్ని చాలా బాగా నిర్వహించిందని, కాని సభలో జరిగిన చర్చలో దానిని సరిగ్గా చెప్పుకోలేకపోయిందని ఆ పార్టీ నుంచి వెళ్ళిపోయిన తెలంగాణ నగారా సమితి నేత, ఎమ్మెల్యే నాగం జనార్దనరెడ్డి వ్యాఖ్యానించారు. 'ఒక్క తెలంగాణ విషయంలోనే నేను పార్టీతో విభేదించా. మంచి జరిగి ఉంటే చెప్పడానికి నాకు ఇబ్బందేమీ లేదు.

విద్యుత్ రంగంలో టీడీపీ చాలా బాగా చేసింది. ఆ రోజు నేను కూడా ప్రభుత్వంలో ఉన్నా. రైతులు గడియారం చూసుకొని పొలం వెళ్ళే స్థాయిలో క రెంటు ఇచ్చింది. ఎంత కరువు ఉన్నా రైతులకు ఇబ్బంది రానీయలేదు. కాంగ్రెస్ వచ్చిన తర్వాత అంతా నాశనం అయింది. టీడీపీ ఎమ్మెల్యేలు ఇంకా బాగా దాడి చేసి ఉండాల్సింది.' అని నాగం అన్నారు. తన రాజకీయ ప్రస్థానంపై ఇంకా ఒక నిర్ణయానికి రాలేదని, ఏ పార్టీలో చేరేది తగిన సమయం వచ్చినప్పుడు చెబుతానని ఆయన అన్నారు.