September 3, 2013

చంద్రబాబు నామస్మరణ తప్ప సోనియా కనబడదా?: శోభా

  'వైసీపీ నాయకురాలు షర్మిల తన తిరుపతి సభలో 36 నిమషాలపాటు చేసిన ప్రసంగంలో చంద్రబాబు పేరు 36 సార్లు ప్రస్తావించారు. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ గురించి మాత్రం ఒక్కసారి కూడా మాట్లాడలేదు. చంద్రబాబును ఇన్నిసార్లు దూషించిన మీరు అసలు దోషి సోనియా గాంధీని ఎందుకు అనలేకపోతున్నారు. మీకూ...కాంగ్రెస్‌కు మధ్య ఏమిటా బంధం' అని తెలుగు మహిళ అధ్యక్షురాలు శోభా హైమావతి ప్రశ్నించారు. మంగళవారం ఆమె ఇక్కడ షర్మిలకు ఒక బహిరంగ లేఖ రాశారు.

ఎన్నికల ముందుగాని...తర్వాతగాని మీ పార్టీ కాంగ్రెస్‌తో కలవబోదని...పొత్తు పెట్టుకోబోదని...సమర్ధించబోదని బైబిల్‌పై మీరు...మీ కుటుంబ సభ్యులు ప్రమాణం చేయగలరా అని ఆమె సవాల్ విసిరారు. సోనియాతో లోపాయికారి ఒప్పందాలు చేసుకొని జగన్ బెయిల్ కోసం పడరాని పాట్లు పడుతున్న తీరును ప్రజలు గమనిస్తున్నారని, ఎన్ని అసత్యాలు చెప్పి భ్రమింపచేద్దామని అనుకొన్నా వైసీపీ ఏనాటికైనా కాంగ్రెస్‌లో కలిసిపోవడం ఖాయమని వారు అర్ధం చేసుకొన్నారని ఆమె అన్నారు.