September 3, 2013

సోనియాతో చెప్పించండి : గాలి ముద్దుకృష్ణమ

తెలుగుదేశం పార్టీ ఇచ్చిన లేఖ కారణంగానే తెలంగాణ ఇచ్చామని సీమాంధ్ర కాంగ్రెస్ నాయకులు చేస్తున్న ప్రకటనలపై టీడీపీ శాసనసభపక్ష ఉపనేత గాలి ముద్దుకృష్ణమనాయుడు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఒకవేళ అదేనిజమైతే ఆ పార్టీ అధినేత సోనియాగాంధీతో ఈ విషయాన్ని చెప్పించాలని ఆయన సవాలు చేశారు. సోనియాగాంధీ ఆ మాట చెబితే అప్పుడు మా నిర్ణయం ప్రకటిస్తామని ఆయన అన్నారు. మంగళవారం సచివాలయంలో ఆయన విలేకర్లతో మాట్లాడారు. ఓట్లు, సీట్లు కోసం రాష్ట్రాన్ని ఏకపక్షంగా విభజించిన కాంగ్రెస్ పార్టీ ఆ నెపాన్ని తెలుగుదేశం పార్టీ మీద వేసి లబ్ధి పొందాలని చూస్తుందని అన్నారు.

తెలంగాణను సోనియాగాంధీయే ఇచ్చిందని ప్రచారం చేసుకుంటున్న ఆ ప్రాంత కాంగ్రెస్ నాయకులు, మేమే తెచ్చామని టీఆర్ఎస్ నాయకులు చేస్తున్న ప్రచారాన్ని ఆయన గుర్తుచేశారు. సీమాంధ్రలో మాత్రం చంద్రబాబు ఇచ్చిన లేఖ కారణంగానే కేంద్రం రాష్ట్రాన్ని విభజించిందని ప్రచారం చేస్తున్నారని ఆయన దుయ్యబెట్టారు. ఉద్యోగాలు, నీరు, విద్యుత్ వంటి సమస్యలు తేల్చకుండా రాష్ట్రాన్ని విభజించడం అన్యాయమని ఆయన అన్నారు. అధికారం కోసం మత కల్లోలాలు, ఘర్షణలు పెట్టడం కాంగ్రెస్‌కు అలవాటేనని ఆయన ఆరోపించారు. చంద్రబాబు హయాంలోనే హైదరాబాద్ అంతర్జాతీయస్థాయిలో అభివృద్ధి సాధించిందన్నారు.