September 2, 2013

ఢిల్లీలో తెలుగువారికి అవమానం : ఎంపీ నామా


దేశ రాజధాని ఢిల్లీలో తెలుగువారికి అవమానం జరిగిందని, తెలుగుదేశం పార్టీకి చెందిన ఎంపీ శివప్రసాద్‌పైన కాంగ్రెస్ ఎంపీ సందీప్ దీక్షిత్ దౌర్జన్యం చేశారని, ఢిల్లీలో ఎలా తిరుగుతావో చూస్తానని బెదిరించారని టీడీపీ ఎంపీ నామా నాగేశ్వరరావు ఆరోపించారు. ఈ సందర్భంగా సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ శివప్రసాద్ ఇందిరాగాంధీ మాస్క్ పెట్టుకుంటే చంపేస్తానని సందీప్ దీక్షిత్ బెదిరిస్తున్నారని, ఆయనకు టీ కాంగ్రెస్ ఎంపీలు మద్దుతు పలుకుతున్నారని పేర్కొంటూ లోక్‌సభ స్పీకర్‌కు నామా పిర్యాదు చేశారు.

పార్లమెంటులో నిరసన తెలిపే హక్కు అందరికీ ఉంటుందని, తెలుగువారిపై దాడి చేయడానికి మీరెవరని సందీప్ దీక్షిత్‌పై నామా నాగేశ్వరరావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. సభ్యులు తమ తమ అభిప్రాయాలకనుగుణంగా నిరసన వ్యక్తం చేసుకోవచ్చునని అన్నారు. అందుకే ఇందిరా గాంధీ మాస్కుతో తమ ఎంపీలు వచ్చారన్నారు. కాంగ్రెస్ నేతల గూండా గిరి చెల్లదని అన్నారు. పార్లమెంట్‌లో కాంగ్రెస్ ఎంపీల తీరు రౌడీల్లా ఉందని నామా విమర్శించారు. సందీప్ చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. తెలంగాణ విషయంలో తమ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు చాలా స్పష్టంగా ఉన్నారన్నారు.