March 9, 2013

నీళ్లూ.. కన్నీళ్లూ.. ఆ కాలువలోనే!

ఆ జిల్లాలో అడుగుపెట్టగానే తొలుత నా కన్ను చెరువులపై పడింది. మూడు పంటలు పండే జిల్లా ఇది. సాగునీరు విషయంలోనే కాదు.. తాగునీటిపైనా ముందుచూపు ఎక్కువే. ఎండాకాలం వస్తున్నదంటే ముందుగా చెరువులు నింపుకుంటారు. వేసవి ఎద్దడిని ఎదుర్కొనేందుకు చేసుకునే ఏర్పాట్లలో ఇదే కీలకం. డెల్టా ప్రాంతమంతటా కనిపించేదే అయినా.. పశ్చిమ గోదావరిలో ఈ సంప్రదాయం కొట్టవచ్చినట్టు కనిపిస్తుంది. కానీ, ఉప్పుటేరు వంతెన మీదుగా పోతున్నప్పుడు ఆ వంతెన కింద వినిపించిన గలగలలే తప్ప ఆ తరువాత నీటి ఛాయలే కనిపించలేదు. చెరువులన్నీ బావురుమంటున్నాయి.

బాధనిపించింది. ఆరా తీశాను. "అదంటే ఇదంటారు.. ఇదంటే అదంటారు. చివరకు మా చెరువులను ఎండబెట్టా రు. రబీ సాగు అవసరాలు ముఖ్యమన్నారు. తాగునీటికి ఎండగట్టారు. పోనీ, సాగుకైనా న్యాయం చేశారా అంటే అదీలేదు. డెల్టాని ఉద్ధరిస్తున్నామంటూ చుక్కనీరు వదలలేదు. అటు సాగునీరూ లేదు. ఇటు తాగునీరూ లేదు.. ఏమి చేతుము సామీ'' అని ఓ రైతు వాపోయాడు. కృష్ణాని వదిలిపెట్టిన తొలి అడుగులోనే ఈ జిల్లా కష్టం తెలిసిపోయింది.

చెరువుల్లోనే కాదు.. ఈ కాలువల్లోనూ కన్నీరే పారుతోంది. ఉప్పుటేరు ప్రాంతంలోని వెంకయ్య-వయ్యేరు కాలువ.. చుట్టుపక్కల గ్రామాలకు జీవన వనరు. తలాటున గోదారి పారుతున్నా తలకి నీళ్లు లేవన్న చందంగా ఉంది ఇక్కడి ప్రజల బతుకు. కాలువను ఆధునీకరిస్తామని చెప్పడమేగానీ, ఏళ్లు గడుస్తున్నా అతీగతీ లేదట. రేపు ఫలహారం పెడతామని చెప్పి ఈరోజు గంజి కుండ పగలగొట్టినట్టు.. కాలువ ఆ«ధునికీకరణ పనులంటూ నీళ్లు వదలడం మానేశారట. ఇప్పటికి 30 కోట్ల రూపాయలు హారతి కర్పూరం అయ్యాయట. నీళ్లూ, కన్నీళ్లూ ఒకే కాలువలో!