December 30, 2012

తెలంగాణకు కేసీఆరే అడ్డంకి




ప్రత్యేక తెలంగాణ ఏర్పాటుకు కేసీఆరే అడ్డంకిగా మారాడని సామాజిక తెలంగాణ జేఏసీ రాష్ట్ర చైర్మన్, ప్రొఫెసర్ గాలి వినోద్‌కుమార్ ఆరోపించారు. ఆదివారం టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు ' వస్తున్నా మీకోసం' పాదయాత్రకు మొగుళ్లపల్లి శివారులో మద్దతు తెలిపిన అనంతరం ఆయన మాట్లాడారు. ఆనాటి కేంద్రం హోం మంత్రి పి.చిదంబరంతో కేసీఆర్ కుమ్మక్కై తెలంగాణ రాకుండా అడ్డుపడ్డాడని, ఇప్పుడు సుశీల్‌కుమార్‌షిండేతో రహస్య ఒప్పందం కుదుర్చుకుని తెలంగాణకు అడ్డుపడుతున్నాడని ఆరోపించారు.

షిండేతో కేసీఆర్‌కు కుదిరి న రహస్య ఒప్పందం ఏమిటో వెల్లడించాలని ఆయన డిమాండ్ చేశారు. అఖిలపక్ష సమావేశంలో తెలంగాణపైన టీడీపీ స్పష్టమైన వైఖరి చెప్పిందని, అందుకు ఆ పార్టీ అధినేత చంద్రబాబును అభినందిస్తున్నామన్నారు. టీడీపీని కేసీఆర్ విమర్శించడంలో మతలబు ఏమిటో చెప్పాలన్నారు.


మాదిగను ముఖ్యమంత్రి చేస్తానని బాబు ప్రకటించాలి

తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే మాదిగను ముఖ్యమంత్రిని చేస్తానని చంద్రబాబునాయుడు ప్రకటించాలని ఆయన కోరారు. పాదయాత్రకు సంఘీభావంగా తాము బాబు వెంట సాగుతున్నట్లు తెలిపారు. ప్రొఫెసర్ అన్సూరి, చంద్రానాయక్, ఓయూ జేఏసీ కో-కన్వీనర్ సిహెచ్.వెంకట్‌రెడ్డి, ఫయాజ్, సతీష్‌మాదిగ తదితరులు పాల్గొన్నారు.